Pawan Kalyan- Kondagattu: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వారాహితో కలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ కదిలారు. ఏపీలో తాను చేపట్టబోయే బస్సు యాత్ర కోసం వారాహి వాహనానికి పూజ చేయించడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాదు నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు.

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు జరిపారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించిన వేద పండితులు. ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు.. పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని వేద పండితులు ప్రారంభించారు.

వారాహి ప్రారంభం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. విజయం తథ్యం అంటూ పూజారులు పవన్ కు ఆశీస్సులు అందించారు.
