Mood Of The Nation Survey: దేశంలో మోదీ చరిష్మాకు తిరుగలేదంటున్నారు ఓటర్లు. ఆయనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పాలకులపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు అన్న అంశంపై ఇండియా టుడే–సీవోటర్స్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమేననీ సర్వే తేల్చింది. ఎన్డీయేకు 284 సీట్లు – ఇతరులకు 191 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గతం కంటే ఎన్డీఏ సీట్లు తగ్గగా.. యూపీఏ సీట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీపోరుపై ఆసక్తి కర అంశాలను వెల్లడించింది.

చెక్కు చెదరని మోదీ పాపులారిటీ..
ఇండియా టుడే–సీవోటర్స్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే లో ప్రధానంగా ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని సర్వేలో తెలిపింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 68 సీట్లకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇతరులతో కలిపి యూపీఏ కూటమికి 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ఇక ప్రధాని మోదీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోదీ పనితీరుపై తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్టులో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా ఆ రేటింగ్ 11 శాతం పెరిగింది.
బీజేపీ వ్యతిరేక సీట్లలో పెరుగుదల
కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులతో కలిపి విపక్షాలకు 191 సీట్లు వస్తాయని సర్వే సంస్థ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ సారథి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు రాహుల్ గాంధీకి 26 శాతం మంది ఓటేశారు. 17 శాతం సచిన్ పైలట్వైపు మొగ్గు చూపారు.
విజయాలు.. అపజయాలు..
సర్వేలో పాల్గొన్న ఓటర్లు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు.. ఫెయిల్యూర్స్ పైన తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. అందులో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొవిడ్ మేనేజ్మెంట్కు 20%, మంది మద్దతుగా నిలవగా.. ఆర్టికల్ 370 రద్దుకు 14% శాతం మంది మద్దతు తెలిపారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణానికి 12% మంది ఓటేశారు. మోదీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్కు మద్దతు..
ఇక దేశంలో ప్రతిపక్ష నేత ఎవరైతే బాగుంటుందని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నకు చాలామంది కాంగ్రెస్ను పక్కన పెట్టారు. ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్కి 24 శాతం మంది మద్దతు తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి 20 శాతం మంది ఓటు వేశారు. మోదీకి ధీటైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేవలం 13 శాతం మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది.

తెలుగు రాష్ట్రాల్లో నువ్వా నేనా..
ఇక ఇదే సర్వే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిపై కూడా సర్వే చేసింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో టీడీపీ 3, వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలుచుకోగా.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుందని తెలిపింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. పొత్తుతో ముందుకు వెళ్తుందా అనే దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ గతంలో నాలుగు సీట్లు గెలువగా, వచ్చే ఎన్నికల్లో మరింత పుంజుకుంటుందని స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరగ్గా.. తెలంగాణలోనూ ఆ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఎన్నికల ఏడాదిలో ఇండియా టుడే– సీ ఓటర్ చేసిన సర్వే ఫలితాలు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమే అన్న సంకేతం ఇచ్చాయి. తెలంగాణ మూడ్ మారుతోందన్న అభిప్రాయం ఈ సర్వే ద్వారా స్పష్టమైంది.