Ayodhya Ram Mandir : రామ మందిర నిర్మాణం.. ఎల్ అండ్ టీ కంపెనీ “షేర్” రాతే మారిపోయింది

మందిర నిర్మాణానికి దాదాపు 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిర్మాణ సంస్థ అంచనా వేస్తోంది

Written By: Anabothula Bhaskar, Updated On : January 7, 2024 8:02 pm
Follow us on

Ayodhya Ram Mandir :ఒకటి కాదు రెండు కాదు దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ. చాలా ప్రభుత్వాలు మారాయి. కోర్టుల్లో ఏ ళ్ళకొద్దీ కేసులు నడిచాయి. చివరికి రాముడు జన్మించిన భూమిలో రామ మందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఫలితంగా వందల ఏళ్ల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. అయితే ఈ రామ మందిరం నిర్మాణం కోసం జాతి యావత్తు మొత్తం ముందుకు వచ్చింది. మతాలతో సంబంధం లేకుండా రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చింది. ఏ ప్రభుత్వం ప్రమేయం లేకుండానే రామ మందిర నిర్మాణం సహకారం అయింది. రాముడు జన్మించిన భూమిలో రాముడికి ఒక కోవెల నిర్మితమైంది. ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈ రామ మందిర నిర్మాణం జరిగింది. పూర్తి భారతీయ వాస్తు కళ శిల్పరీతులతో ఈ మందిర నిర్మాణం పూర్తయింది. అయితే ఈ మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రామ మందిరాన్ని దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి నిర్మిస్తోంది. తెలంగాణలోని ప్రఖ్యాత సైబరాబాద్ ఐటీ టవర్స్ ను ఈ సంస్థ నిర్మించింది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను కూడా ఈ సంస్థ పూర్తి చేసింది. ఢిల్లీలోని లోటస్ టెంపుల్, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ.. వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఈ సంస్థ పూర్తి చేసింది. లార్సెన్ & టుబ్రో( ఎల్ అండ్ టీ) దేశంలోనే 4 లక్షల కోట్ల విలువైన పనుల ఆర్డర్ బుక్ తో అతిపెద్ద కంపెనీగా కూడా నిలిచింది. అయితే 2020 ఆగస్టు ఐదున ఈ రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎప్పుడైతే భూమి పూజ పూర్తయిందో.. ఈ నిర్మాణ బాధ్యతలను రామమందిర నిర్మాణ ట్రస్ట్ ఎల్ అండ్ టీ కి అప్పగించింది. ఇక ఎప్పుడైతే ఈ బాధ్యతలను ఆ కంపెనీ తీసుకుందో అప్పటినుంచి ఇప్పటివరకు ఎల్ అండ్ టీ షేర్లు 270 శాతం వరకు రాబడిని ఇచ్చాయని ఆ సంస్థ వర్గాలు. ఆగస్టు 5 2020లో ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ధర 934 రూపాయలుగా ఉండేది. జనవరి 4 2024 కి కంపెనీ షేర్ ధర ఏకంగా 3452 రూపాయల రికార్డు స్థాయిలో ట్రేడ్ అవడం విశేషం.

లార్సెన్ & టుబ్రో( ఎల్ అండ్ టీ) కంపెనీ షేర్ ధరలు పెట్టుబడిదారులకు తిరుగులేని లాభాలను అందించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో.. పెద్ద కంపెనీలు నిరాశాజనకమైన ఫలితాలను నమోదు చేశాయి. కానీ లార్సెన్ & టుబ్రో( ఎల్ అండ్ టీ) మాత్రం తిరుగులేని లాభాలను నమోదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి స్టాక్ బ్రోకరేజీ సంస్థలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వచ్చే కాలంలో కూడా ఈ కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు మరింత ఆదాయాన్ని తెస్తాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రముఖ బ్రోకరేజి సంస్థ నోమూరా అయితే ఈ కంపెనీకి సంబంధించి షేర్లను వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమమని మదుపరులకు సూచిస్తోంది. కేవలం లార్సెన్ & టుబ్రో( ఎల్ అండ్ టీ) మాత్రమే కాకుండా ఆలయంలోపల ఇతర ఇంజనీరింగ్ నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ కంపెనీకి చెందిన ఇంజనీర్లు పూర్తి చేశారు. ఇక ఈ ఆలయానికి సంబంధించి తలుపుల నిర్మాణాన్ని హైదరాబాద్ నగరానికి చెందిన అనురాధ టింబర్స్ పూర్తి చేసింది. మందిర నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలపై జై శ్రీరామ్ అని రాశారు. మందిర నిర్మాణానికి దాదాపు 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిర్మాణ సంస్థ అంచనా వేస్తోంది