Lok Sabha Elections 2024 : తెలంగాణ సీట్లపై ‘కమ్మ’ వారి కన్ను.. ఆ రెండు స్థానాలకు పట్టు!

మల్కాజ్‌గిరి టికెట్‌ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మ నేతకు టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 10:54 am
Follow us on

Lok Sabha Elections 2024 : మరో పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రధాని మోదీ మరోమారు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈనెల 4, 5వ తేదీల్లో పర్యటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. బీఆర్‌ఎస్‌ కూడా అభ్యర్థుల వేటలో పడింది.

ఆ రెండు స్థానాలపై కమ్మల నజర్‌..
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ నాయకులు విజయం సాధించలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ తరుణంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్‌గిరితోపాటు, ఖమ్మం లోక్‌సభ సీట్లు కమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు.

అధికార పార్టీకి వినతి..
మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి విక్రమార్క భార్య, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. రేణుకాచౌదరి కమ్మ నేత అయినప్పటికీ ఆమెకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ టికెట్‌ కూడా కమ్మలకే ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కానీ కాంగ్రెస్‌ ఆ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రెస్‌క్లబ్‌ వేదికగా గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కమ్మలకు అన్ని పార్టీలు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

మల్కాజ్‌గిరి ఎందుకంటే..
మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ ఉత్తరాది ప్రజలతోపాటు, ఆంధ్రా సెటిలర్స్‌ ఎక్కువగా ఉంటారు. మినీ ఇండియాగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి కమ్మ నేతలకు టికెట్‌ ఇస్తే ఈజీగా గెలుస్తారని భావిస్తున్నారు. అందుకే మల్కాజ్‌గిరి టికెట్‌ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మ నేతకు టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు.