KTR vs Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల చేవెళ్ల సభలో సీఎం రేవంత్ తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. దీనిపై కేటీఆర్ గురువారం(ఫిబ్రవరి 29న) స్పందించారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఛాలెంజ్ చేశారు. ‘నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం’ అని సీరియస్ కామెంట్స్ చేశారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని విమర్శించారు. సునీతామహేందర్రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచర్ల శేఖర్రెడ్డికి అవకాశం ఇస్తానంటేనే కాంగ్రెస్లో చేరారని తెలిపారు.
భయం వెంటాడుతోంది..
‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే మేం ఎత్తివేశాం. ప్రస్తుతం మా దృష్టి పూరి్తగా తెలంగాణపైనే. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడితే కాదా? రేవంత్ను ఏదో భయం వెంటాడుతోంది. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు పెన్షన్ ఇవ్వాలి అని మేము అడగలేమా?’ అని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై అంత నమ్మకమా..
‘రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి జాతీయ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీల విషయంలో బాగా నమ్మకం ఉందా.. ముందు రిజర్వాయర్కు, బ్యారేజీకి తేడా తెలుసుకోవాలి. ఇరిగేషన్ మంత్రిగా కొత్తగా బాధ్యలు చేపట్టారు. అన్నీ తెలుసుకుంటే మంచిది. కేసీఆర్ను బద్నాం చేయాలనుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ మెడిగడ్డకు వెంటనే మరమ్మతు చేయండి. రాజకీయ వేధింపులకు భయపడం. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఎన్డీఎస్ఏ దేశంలో ఎక్కడైనా రెండు రోజుల్లో నివేదికను ఇచ్చిందా? రేవంత్ అసెంబ్లీలో చెప్పినట్లు మీకు చేతగాకపోతే మాకు అప్పగించండి. ఇరిగేషన్ శాఖ ఇస్తారా? ప్రభుత్వం నుంచి తప్పుకుంటారా?’ అని నిలదీశారు.
కాళేశ్వరంకు 400 అనుమతులు..
ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెకు్టకు 400 అనుమతులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. మరమ్మతు చేతకాకపోతే తప్పకోవాలని రేవంత్కు సూచించారు. హరీశ్ చెప్పినట్లు తాము నీటిని లిఫ్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఈ నివేదిక మీడియాకు ఎలా అందిందని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి వర్షాకాలం ప్రారంభంలోగా మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు.
వాళ్లకు సెన్స్ లేదు.. కామన్ సెన్స్ లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 80 రోజుల పాలనలో ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలక్షేపం చేసిందని విమర్శంచారు. కాంగ్రెస్ మంత్రులకు సెన్సు, కామన్సెన్సు లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని తెలిపారు. నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.