KCR : అసెంబ్లీకి కేసీఆర్ రానట్టే.. ఎంపీగా జాతీయ రాజకీయాల్లోకి.. సీఎల్పీ లీడర్‌గా కేటీఆర్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ బరిలో ఉంటారని తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లడం కన్నా.. పార్లమెంట్‌కు వెళ్లడమే మేలని.. అదే ఈ ఉద్యమనేతకు, సీఎంగా చేసిన కేసీఆర్ కు గౌరవంగా భావిస్తున్నట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : December 3, 2023 7:56 pm
Follow us on

KCR : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత బీఆర్‌ఎస్‌కు విచిత్ర పరిస్థితి ఎదురు కానుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి సీట‍్లను గెలిచింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిపై చర్చ మొదలైంది. రాత్రికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. సోమవారంమే ప్రమాణస్వీకారం ఉంటుదన్న లీకులు వస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందే రేవంత్‌ ప్రకటించినట్లుగా డిసెంబర్‌ 9న ప్రభుత్వం కొలువు దీరుతుందా అన్నది రేపటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఎవరు?
ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజలు అప్పగించిన కొత్త బాధ్యతను విశ్వాసంతో నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించుకుంటామని తెలిపారు.  ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించే బీఆర్‌ఎస్‌కు శాసన సభా పక్ష నేతగా ఎవరు ఉంటారన్న చర్చ బీఆర్‌ఎస్‌తోపాటు తెలంగాణ ప్రజల్లో జరుగుతోంది. తొమ్మిదన్నరేళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేసీఆర్‌.. ఇప్పుడు అవమాన భారంతో కనీసం గవర్నర్ కు నేరుగా రాజీనామా లేఖ పంపకుండా తన ఓఎస్డీకి ఇచ్చేసి ప్రగతిభవన్ ను ఖాళీ చేసి తన ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. సీఎంగా అన్నేళ్లు చేసి ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసినా వైఎస్సార్‌ హయాంలో, ప్రస్తుతం జగన్‌ హయాంలో విపక్ష నేతగా ఉన్నారు. కానీ, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్‌ వ్యక్తిత‍్వం, ఆయన అహంకార ధోరణి, అధికార కాంగ్రెస్‌ ఎదుట తలెత్తుకుని నిలబడతారా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లో పార్టీ శాసన సభాపక్ష నేతగా కేటీఆర్‌ ఉంటారన్న చర్చ కూడా మొదలైంది.

మెదక్‌ ఎంపీగా కేసీఆర్‌..
ప్రస్తుత పరస్థితుల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవచ్చని తెలుస్తోంది. ఆయన త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్‌ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ బరిలో ఉంటారని తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లడం కన్నా.. పార్లమెంట్‌కు వెళ్లడమే మేలని.. అదే ఈ ఉద్యమనేతకు, సీఎంగా చేసిన కేసీఆర్ కు గౌరవంగా భావిస్తున్నట్లు సమాచారం.