Biryani: ఏడాదిలో 1633 బిర్యానీలా? అంత జిహ్వ చాపల్యం ఏంటి నాయనా?

కేవలం హైదరాబాదీయులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చాలా మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. 2023 సంవత్సరంలో దేశంలో సెకన్ కు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 15, 2023 3:32 pm

Biryani

Follow us on

Biryani: సండే యా రహే మండే రోజూ కావో అండే అదేదో గుడ్డు యాడ్ కు సంబంధించి చెబుతుంటారు కదా.. అంటే రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని దాని ఉద్దేశం.కానీ ఇతగాడు మాత్రం ఆ స్థానంలో బిర్యాని యాడ్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిలో ఏకంగా 1633 బిర్యానీలు తెప్పించాడు. ఇదేదో సంచలనం కోసమో, మరో దాని కోసమో మేము చెబుతున్నది కాదు. ప్రఖ్యాత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి చెప్పిన లెక్కలు ఇవి.. కేవలం హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 1633 బిర్యానీలు తెప్పించాడు అంటే.. మిగతా హైదరాబాదీల సంగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతగాడి గురించి స్విగ్గి చెప్పిన తర్వాత ఇంత జిహ్వచాపల్యం ఏంటి నాయనా అని అందరూ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు దేశంలో వచ్చే ప్రతి ఆరు ఆర్డర్లలో ఒకటి హైదరాబాదీయులే చేస్తున్నారని స్విగ్గి ప్రకటించింది.. ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో స్విగ్గి ఈ వివరాలు ప్రకటించింది. హైదరాబాదీయులు చేసే ఆర్డర్లలో టాప్ ప్లేస్ బిర్యాని దేనని స్విగ్గి ప్రకటించింది. స్విగ్గి ఆవిర్భవించిన నాటి నుంచి ప్రతి ఏడాది ఇలా నివేదిక విడుదల చేస్తుంది. అయితే ఈ సంవత్సరం తో కలిపి బిర్యానీ వరుసగా ఎనిమిదవ సారి టాప్ ప్లేస్ దక్కించుకుంది.

దేశవ్యాప్తంగా క్రేజ్

కేవలం హైదరాబాదీయులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చాలా మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. 2023 సంవత్సరంలో దేశంలో సెకన్ కు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. అయితే ప్రతి 5.5 బిర్యానీలలో ఒక వెజ్ బిర్యానీ కూడా ఉంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ నగరాల్లో చికెన్ బిర్యాని ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. బిర్యానీ ల కోసం పదివేల నుంచి ఆర్డర్లు చేసిన కస్టమర్లు ఈ మూడు నగరాలోనే ఎక్కువగా ఉండడం విశేషం.. ఇక హైదరాబాద్ నగరంలో ప్రజలు బిర్యాని ఆర్డర్లలో తమ సత్తా చూపించారు. స్విగ్గి సంస్థకు వచ్చిన ప్రతి ఆరు ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచి రావడం విశేషం. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఏడాది మొత్తంలో ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ చేసి “బిర్యాని బ్రిగేడ్” విజేతగా నిలిచాడు. ఈ ప్రకారం ఆ వ్యక్తి సరాసరిగా రోజుకు నాలుగు బిర్యానీలు ఆర్డర్ చేశాడన్నమాట. ఇక ఇతడే ఇలా ఉంటే ముంబై మహా నగరానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్స్ చేసినట్టు స్విగ్గి ప్రకటించింది.

గులాబ్ జామ్ కూడా..

బిర్యానీ మాత్రమే కాదు దుర్గాపూజ సమయంలో గులాబ్ జామున్ లు ఆర్డర్లు ఎక్కువ వచ్చినట్టు స్విగ్గి ప్రకటించింది. 7.7 మిలియన్ల ఆర్డర్లతో అంతకుముందున్న రసగుల్లా ఆర్డర్లను గులాబ్ జామున్ మించిపోయింది. నవరాత్రి సమయంలో మసాలా దోశలను కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసినట్టు స్విగ్గి ప్రకటించింది. ఇక బెంగళూరులో కేక్ క్యాపిటల్ అంటూ స్విగ్గి ఒక బిరుదు ఇచ్చింది. ఈ ఒక్క నగరం నుంచే చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఇక వాలెంటెన్స్ డే రోజు దేశంలో నిమిషానికి 271 కేకులకు ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గి ప్రకటించింది. నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన ఒక కస్టమర్ మాత్రం ఒక్క రోజులైనా ఏకంగా 92 కేకులు ఆర్డర్ చేశాడు.. ఇవే కాకుండా నార్త్ ఇండియన్ థాలి, సౌత్ ఇండియన్ థాలి, పనీర్ కుర్మా, మెంతి చమన్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మొగలాయి వంటకాలు కూడా భారీ స్థాయిలో ఆర్డర్ అయ్యాయని స్విగ్గి వివరించింది. ఒక్క స్విగ్గిలోనే ఇలా ఉంటే ఇక జొమాటో, ఉబర్.. వార్షిక నివేదికలో ఇంకా ఎన్ని సంచలమైన ఫుడ్ విషయాలు ఉన్నాయో..