Japan earthquake Tsunami : భారీ భూకంపం.. సునామీ.. జపాన్ ను ఆ దేవుడే కాపాడాలి

ఒకవేళ అణుకేంద్రాలు దెబ్బతింటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు. దాని ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుందని చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : January 1, 2024 4:05 pm
Follow us on

Japan earthquake Tsunami : ప్రపంచమంతా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకుంటుంటే.. జపాన్‌ వాసులు మాత్రం సునామీ భయంతో వణుకుతున్నారు. 2024 వస్తూ వస్తూనే జపాన్‌కు సునామీని మోసుకొచ్చింది. భూకంపాలకు కేంద్రమైన జపాన్‌లో సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.4గా నమోదైంది. జపాన్‌ తీర ప్రాంతంలోని షికవా ప్రీఫెక్షర్‌ రీజియన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇది జపాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 గంటలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. తీరప్రాంతంలో భూకంప కేంద్రం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం..
ఇషికావ ప్రీఫెక్షర్‌ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే భూమి పొరల పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత.. తీర ప్రాంతంలోని ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ మూడు రీజియన్ల పరిధిలో ఉన్న నగరాలను భయభ్రాంతులకు గురి చేసింది. తీర నగరాలైన వజీమా, నొటో, కషివజక్కిల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

70 నిమిషాలు.. 20 ప్రకంపనలు..
ఇషికావ ప్రీఫెక్షర్‌ పరిధిలో భూకంపంతో 70 నిమిషాల్లో(4:10 నిమిషాల నుంచి 5:20 మధ్యకాలంలో) ఏకంగా 20 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు గుర్తించలేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. తీర ప్రాంత నగరాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. వాటి శిథిలాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. సునామీ అలల ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. అనమిఝు, ననావో, న్యూజెన్, కురొబె–షి తీరాల్లో అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్లు జపాన్‌ న్యూస్‌ అవుట్‌లెట్‌ ఎ¯Œ హెచ్‌కే తెలిపింది.

సునామీ ప్రకటన..
ఇక జపాన్‌ ప్రభుత్వం సునామీ సంభవించినట్లు అధికారికంగా ప్రకటించింది. భూకంపం, సునామీ ప్రభావిత ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్స్‌ ఏర్పడ్డాయి. విద్యుత్‌ సరఫరా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌ వర్క్‌ కూడా అందుబాటులో ఉండట్లేదు. కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ సైతం బంద్‌ అయింది. కుప్ప కూలిన భవనాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ అత్యవసర సమావేశాన్ని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేవించింది. ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అణు కేంద్రాల వద్ద ఏర్పాట్లు..
మరోవైపు సునామీతో అణు కేంద్రాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో అప్రమత్తమైన జపాన్‌ ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలకు ఆదేశించింది. సునామీ వచ్చినా అణువిద్యుత్‌ కేంద్రాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ అణుకేంద్రాలు దెబ్బతింటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు. దాని ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుందని చెబుతున్నారు.