Fake Votes in AP : సంచలనం : ఏపీలో దొంగ ఓట్లపై ఈసీ సీరియస్.. ఏకంగా కలెక్టర్ పై వేటు!

ఇప్పుడు బిజెపి నేతల ఫిర్యాదుతో మరో అధికారిపై వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని.. దొంగ ఓట్ల పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల కమిషన్ అధికారులకు విపక్షాలు కోరుతున్నాయి.

Written By: Dharma, Updated On : January 18, 2024 9:46 am
Follow us on

Fake Votes in AP : ఏపీలో దొంగ ఓట్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా ఓ జిల్లా కలెక్టర్ పైనే వేటు వేసింది. దీంతో ఇది సంచలనం గా మారింది. సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఎన్నికల అధికారి యూనిక్ ఐడి నుంచి పెద్ద ఎత్తున ఓట్లను డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిజెపి ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ దర్యాప్తు చేపట్టింది. నిజమేనని తేలడంతో చర్యలకు దిగింది. దీనికి బాధ్యులను చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు వేసింది.

2021లో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసిన గిరీషా ఈఆర్వోగా వ్యవహరించారు. పోలింగ్ కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30 వేలకు పైగా యపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి.. దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిజెపి నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గిరీషా ఐడితో వేల సంఖ్యలో యపిక్ కార్డులను డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. ఇటీవల విజయవాడలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా వేటు వేశారు. దీనిలో ప్రమేయం ఉన్న అధికారులపై చర్యలకు ఎలక్షన్ కమిషన్ ఉపక్రమించింది.

అయితే ఏకంగా ఓ కలెక్టర్ పై ఎలక్షన్ కమిషన్ వేటువేయడం సంచలనం కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లదే. కానీ రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎన్ని రకాల ఫిర్యాదులు వస్తున్నా వారు స్పందించడం లేదు. చివరకు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. కొందరైతే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో దొంగ ఓట్లపై స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దాదాపు ఏడాది పాటు నిరీక్షించిన తర్వాత ఈసీ అధికారులు విచారణను ప్రారంభించారు. అక్రమాలు నిజమేనని తేలాక చర్యలకు దిగారు. ఇప్పుడు బిజెపి నేతల ఫిర్యాదుతో మరో అధికారిపై వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని.. దొంగ ఓట్ల పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల కమిషన్ అధికారులకు విపక్షాలు కోరుతున్నాయి.