PARLIAMENT UNIFORM : పుష్పం ఉంటే అది బీజేపీ కమలమేనా? ఇందులోనూ రాజకీయాలు వెతకాలా?

ఇదంతా సరే పార్లమెంటు సమావేశాలకు వచ్చే ప్రజాప్రతినిధులకు కూడా ఒక మంచి యూనిఫామ్ నిబంధన తీసుకువచ్చే ఆలోచనలో మోడీ ఉన్నారట.. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి..

Written By: Bhaskar, Updated On : September 13, 2023 10:40 pm

dress code

Follow us on

PARLIAMENT UNIFORM : మోడీ ఈ దేశ ప్రధాని. కమలం అతడి పార్టీ గుర్తు. కమలం నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి బిజెపి కార్యకర్త అనుకోవాలా? అదేంటి అలా ఎలా అవుతుంది? అనేదే మీ ప్రశ్న కదా? ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ కూడా ఇలానే ఉంది.. పార్లమెంటరీ సిబ్బంది యూనిఫామ్ మీద కూడా ప్రతిపక్షాలు చేస్తున్న గాయి తలా తోకా లేకుండా ఉంది. వాస్తవానికి ప్రతి గుడిలో దేవుళ్ళు అభయహస్తం చూపిస్తుంటారు. భక్తులను దీవిస్తున్న ముద్ర లో కనిపిస్తుంటారు. ఈ లెక్కన ప్రతి దేవుడు కూడా కాంగ్రెస్ ఎన్నికల గుర్తులను ప్రచారం చేస్తున్నట్టేనా? జాతీయ పతాకం రంగులను తమ పార్టీ పతాకంలో ఉపయోగిస్తారు. అది సమంజసమైనదేనా? చివరికి విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి.. అది వాంఛనీయమేనా? ఇలా తవ్వుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు మన మెదడుని చికాకు పరుస్తాయి. కానీ ఇదే సోయి ఈ దేశంలో ప్రతిపక్షాలకు లేదు.

“బిజెపి వాళ్లకు ఈ చీప్ టాక్టిస్ బాగా అలవాటయింది. జీ_20 సదస్సును కూడా అలాగే వాడుకున్నారు. ఇప్పుడేమో జాతీయ పుష్పం పేరిట కమలాన్ని, అంటే తమ ఎన్నికల గుర్తును ఏకంగా పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్ మీదకు ఎక్కించారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పార్లమెంటు సిబ్బంది అంటే బిజెపి సిబ్బంది కాదు. ఈ కమలం డిజన్ ఎంపిక ద్వారా బిజెపి మన ప్రజా స్వామిక ఆలయమైన పార్లమెంట్ ను రాజకీయ క్షేత్రం లాగా మారుస్తోంది. ఇది ఒక రకంగా తమ ప్రచారం కోసం పార్లమెంటును దుర్వినియోగం చేయడమే” అనే తీరుగా ప్రతిపక్షాల ట్విట్టర్ కామెంట్లు సాగుతున్నాయి.

రాజకీయ స్పృహ అనేది ప్రతిపక్షాలకు ఉండాలి. కానీ అది హద్దు దాటితేనే ప్రమాదం. ప్రతిదీ రాజకీయ పార్టీలకు వివాదంగా తోచడం.. అది అంతిమంగా మీడియాలో ప్రచారంలోకి రావడం.. చివరకు ప్రజలను ఇబ్బంది పెడుతుంది. విపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించడానికి ఎప్పుడూ ఏదో ఒకటి అందుబాటులో ఉండాలి. లేదా అందుబాటులో ఉన్న ప్రతిదీ వివాదంగా మలచాలి. ఇండియా కూటమి పెట్టుకున్న తర్వాత ప్రతిపక్షాలు దీనినే పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత.. పార్లమెంటు భవనాన్ని కట్టాడు. కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చింది కదా.. దాని నెత్తిమీద కొలువుతీరిన నాలుగు సింహాలు క్రూరంగా చూస్తున్నట్లు ఉన్నాయని అంశాన్ని కూడా ఆ మధ్య ప్రతిపక్షాలు వివాదం చేశాయి. ఇప్పుడు పార్లమెంటు సిబ్బందికి అమలు చేస్తున్న కొత్త యూనిఫాం కూడా వివాదాల్లోకి వచ్చేసింది. మార్షల్ కు ఒక రకం. విమెన్ స్టాఫ్ కి, మెన్ స్టాఫ్ కి మరొక దుస్తులు యూనిఫామ్ గా ఫిక్స్ చేశారు. అయితే ఒక డ్రెస్ పై కమలాలు ఉన్నాయి. ఇంకేముంది ఇది కచ్చితంగా బిజెపి తమ పార్టీ గుర్తును ప్రచారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని, చివరికి పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్ ను కూడా పార్టీకరిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.. పార్లమెంటు సిబ్బంది యూనిఫామ్ మీద టైగర్స్ బొమ్మలు ముద్రించవచ్చు కదా, పోనీ నెమలి ఉండొచ్చు కదా, మాత్రమే ఎందుకు ఎంచుకున్నట్టు? అనే తీరుగా విపక్షాల ప్రశ్నలు సాగుతున్నాయి.

అయితే త్వరలో ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు కదా! ఈ సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చారు. ఈ యూనిఫామ్ కు ఇండియన్ టచ్ ఇచ్చారు. ఇండియా భారత్ పేరు మార్పిడి రచ్చ సద్దుమణిగిన నేపథ్యంలో.. ఇక ఈ యూనిఫాం చర్చ తెరపైకి వచ్చింది. మరో కొత్త వివాదం వచ్చేవరకు ఇదే టాపిక్.. ఇదంతా సరే పార్లమెంటు సమావేశాలకు వచ్చే ప్రజాప్రతినిధులకు కూడా ఒక మంచి యూనిఫామ్ నిబంధన తీసుకువచ్చే ఆలోచనలో మోడీ ఉన్నారట.. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి..