CM Jagan and Roja: మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్.. వైరల్ వీడియో

గుంటూరు జిల్లాలో ప్రారంభ వేడుకలకు సీఎం జగన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు.క్రీడా శాఖ మంత్రిగా రోజాకు సీఎం జగన్ అగ్ర తాంబూలం ఇచ్చారు. క్రీడాంశాల్లో ఒకటైన క్రికెట్ పోటీలను ప్రారంభించాలని రోజాను ఆహ్వానించారు.

Written By: Dharma, Updated On : December 26, 2023 1:13 pm
Follow us on

CM Jagan and Roja: ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంచనంగా పోటీలను ప్రారంభించారు. సీఎం జగన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిందాంబి శ్రీకాంత్ కలిసి క్రీడాజ్యోతిని వెలిగించారు. సిహెచ్ రమాదేవికి క్రీడల టార్చ్ ను సీఎం జగన్ అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో క్రీడా పోటీలను మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రారంభించారు.కాగా సీఎం జగన్ ప్రారంభించిన క్రీడా పోటీల్లో అరుదైన ఘటన ఒకటి వెలుగు చూసింది. మంత్రి రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

గుంటూరు జిల్లాలో ప్రారంభ వేడుకలకు సీఎం జగన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు.క్రీడా శాఖ మంత్రిగా రోజాకు సీఎం జగన్ అగ్ర తాంబూలం ఇచ్చారు. క్రీడాంశాల్లో ఒకటైన క్రికెట్ పోటీలను ప్రారంభించాలని రోజాను ఆహ్వానించారు.బ్యాటింగ్ చేయాలని సూచించారు. అయితే తనకు బ్యాటింగ్ రాదని రోజా చెప్పడంతో… సీఎం జగన్ స్వయంగా బ్యాట్ ఎలా పట్టాలో? షాట్ ఎలా కొట్టాలో?అవగాహన కల్పించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

సుమారు 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్ర పోటీలు జరగనున్నాయి. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ / వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లాస్థాయిలో, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఎక్కడికక్కడే క్రీడా మైదానాలు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐదు క్రీడాంశాలకు సంబంధించి 228 మంది క్రీడాకారులు లేక గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది ఆపసోపాలు పడడం కనిపించింది. సరైన అవగాహన కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.