Budget 2024: వికసిత్‌ భారత్‌ టార్గెట్‌ 2047

వికసిత్‌ భారత్‌ కోసం దేశంలో పదేళ్లలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరలను ఎప్పటికప్పుడు పెంచామని తెలిపారు. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారని తెలిపారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

Written By: Raj Shekar, Updated On : February 1, 2024 4:54 pm

Budget 2024

Follow us on

Budget 2024: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25పై మాట్లాడారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలిపారు. యువత ఉపాధికి పెద్దపీట వేశాన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో అద్భుత ప్రగతి..
వచ్చే ఐదేళ్లలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్‌కు మాత్రమే డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు.

80 కోట్ల మందికి ఉచిత రేషన్‌
వికసిత్‌ భారత్‌ కోసం దేశంలో పదేళ్లలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరలను ఎప్పటికప్పుడు పెంచామని తెలిపారు. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారని తెలిపారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

అభివృద్ధి చెందిన భారతే లక్ష్యం..
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని తెలిపారు. దానిని తాము అమలు చేసి చూపుతున్నామని చెప్పారు. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం అన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామని తెలిపారు.

11.8 కోట్ల రైతులకు పీఎం కిసాన్‌..
ఇక రైతులకు పెట్టుబడి కోసం ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ఏటా రూ.6 వేల చెప్పున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ఫసల్‌ బీమా తీసుకువచ్చామన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా కీలక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రాలకు సహకారం..
వికసిత్‌ భారత్‌లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు డిజిటల్‌ ఇండియా చాలా కీలకమన్నారు. పన్ను వ్యవస్థలో సంస్కరణలతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పెట్టుబడులకు భద్రత ఏర్పడిందని పేర్కొన్నారు. జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుందని చెప్పారు. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తామని తెలిపారు.

‘వికసిత్‌ భారత్‌’కు బడ్జెట్‌ పునాది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్‌ను మోదీ ప్రశంసించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ గ్యారెంటీ ఇచ్చిందన్నారు. వికసిత్‌ భారత్‌ మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబమన్నారు.