KCR : కేసీఆర్ గతంలో ఏం చేశాడో.. బీఆర్ఎస్ నేతలకు గుర్తుకు రావడం లేదా?

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ కూల్చుతారనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే ఆయన గేట్లు ఎత్తారు. ఇటీవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయన వెంట దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Written By: NARESH, Updated On : March 18, 2024 10:58 pm

KCR, BRS, Congress

Follow us on

KCR : ఎటువంటి అరమరికలు లేకుండా రాజకీయ జీవితాన్ని అధికార పార్టీలో కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అదృష్టం అందరి నాయకులకు ఉండదు. అలాంటి వారిలో దానం నాగేందర్ ముందుంటారనుకుంటా.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయన అందులో ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుందో ఆయన తప్ప ఎవరికీ తెలియదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టికెట్ రాకపోతే రాత్రికి రాత్రే టిడిపిలో చేరారు. ఖైరతాబాద్ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అందులోకి వెళ్లిపోయారు. మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. 2018 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో మంత్రి పదవి వస్తుందని ఆశపడినప్పటికీ చివరి నిమిషంలో తప్పిపోయింది. 2023 ఎన్నికల్లోనూ అదే ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికారం లేకుండా రెండు నెలలు కూడా ఆయన ఉండలేకపోయారు. వెంటనే తన పూర్వస్థానమైన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

సహజంగా ఈ పరిణామం భారత రాష్ట్ర సమితి నాయకులకు రుచించ లేదు. అందుకే వారు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కలిశారు. స్పీకర్ ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కనీసం ఆయన వెంట పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేరు. దీనిపై మీడియాలో ప్రచారం జరగగానే.. ఒక్కసారి గా విమర్శలు మొదలయ్యాయి. “మీ వీపు మీకు కనపడదు కాబట్టి.. కెసిఆర్ హయాంలో ఏం జరిగిందో మీరు చెప్పలేకపోతున్నారంటూ” సోషల్ మీడియాలో పెద్దపెట్టున విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో కేసిఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించారు. బిజెపి మినహా కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, బిఎస్పి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇలా చేర్చుకునే ప్రక్రియకు కేసీఆర్ పెట్టిన పేరు తెలంగాణ పునర్నిర్మాణం. ఇలా రెండు పర్యాయాలు ఏకంగా 39 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆయన భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. చివరికి శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేశారంటే కెసిఆర్ వ్యవహార శైలి అర్థం చేసుకోవచ్చు. అక్కడిదాకా ఎందుకు 2014 ఎన్నికల్లో టిడిపి టికెట్ మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పై గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రిని చేశారు. అప్పటి స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కి అనర్హతపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ కూల్చుతారనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే ఆయన గేట్లు ఎత్తారు. ఇటీవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయన వెంట దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసే ముందు.. ఒక్కసారి కెసిఆర్ గతంలో ఏం చేశారో పునఃశ్చరణ చేసుకుంటే బాగుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.