BJP – Janasena : జనసేనకు బీజేపీ షాక్

వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణలో బిజెపి ఓటమికి జనసేన కారణమని చెప్పుకొస్తున్నాయి.

Written By: NARESH, Updated On : December 15, 2023 10:25 pm
Follow us on

BJP – Janasena : తెలంగాణ బిజెపి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి బిజెపి పోటీ చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల విషయంలో బిజెపి అనుసరించే వ్యూహం పై స్పష్టతనిచ్చారు. తాము బిఆర్ఎస్ తో కలిసి నడిచేది లేదని.. కాంగ్రెస్ తో పాటు బి ఆర్ఎస్ కు సమ దూరం పాటిస్తామని తేల్చేశారు. ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టతనిచ్చారు. దీంతో బిఆర్ఎస్ తో పాటు జనసేనకు బిజెపి ఝలక్ ఇచ్చినట్లు అయ్యింది.

తెలంగాణ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన బిజెపి, జనసేన కలిసి పోటీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలను జనసేనకు బిజెపి కేటాయించింది. కానీ జనసేన ఎనిమిది చోట్ల ఓడిపోయింది. డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే పవన్ సినీ గ్లామర్ పై ఆధారపడి పొత్తు పెట్టుకున్నామని.. అందుకే దెబ్బ తిన్నామని బిజెపి అభిప్రాయపడేలా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. దీనిని బిజెపి నాయకత్వం కూడా ఖండించింది. బిజెపి గౌరవప్రదమైన స్థానాలను తెలంగాణలో దక్కించుకుందని.. ఇదే స్ఫూర్తితో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాలపై దృష్టి పెడతామని చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు కొత్తగా బిఆర్ఎస్ తో బిజెపి జతకడుతుందని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో బిజెపి నాయకత్వం స్పందించాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్న ప్రచారం జరిగింది. ఇదే బిజెపిపై ప్రతికూలత చూపింది. దీంతో చేరుకున్న బీజేపీ నాయకత్వం నేరుగా ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చేసింది. ఒక్క బిఆర్ఎస్ తో కాదు.. మరి ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోమని.. ఒంటరి పోరుతో ముందుకెళ్తామని తేల్చి చెప్పడం విశేషం.

అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణలో బిజెపి ఓటమికి జనసేన కారణమని చెప్పుకొస్తున్నాయి. తెలంగాణలో జనసేనతో కలిసి నడవడం ద్వారా బిజెపికి నష్టం జరిగిందన్నది వైసిపి అనుకూల మీడియా ప్రచారం. కానీ ఇప్పటికే దీనిపై బిజెపి ఖండించింది. అటు ఏపీ నేతలు సైతం తాము జనసేనతో కలిసి నడుస్తామని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకోవడం, బిజెపి కలిసి రానందని తెలియడంతోనే ఈ తరహా ప్రచారానికి వైసీపీ దిగుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. బిజెపి ఆ రెండు పార్టీలతో కలవకూడదన్నదే వైసిపి అభిమతం. అందుకే తెలంగాణ రాజకీయాలను ఏపీకి లింక్ చేస్తూ ప్రచారాన్ని తెరలేపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.