Homeజాతీయ వార్తలుBJP vs Congress: మోడీ, షా, అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు కదా.. సోనియా, రాహుల్ లకు...

BJP vs Congress: మోడీ, షా, అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు కదా.. సోనియా, రాహుల్ లకు ఎందుకంత లొల్లి..?

BJP vs Congress: దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రత్యర్థులను ఎంతగా వేధించిందో.. వెంటాడిందో అందరికీ తెలిసిందే. కేసులు పెట్టి.. సీబీఐ, ఈడీలతో చెరబట్టి వారికి బెయిల్ దక్కకుండా జైల్లో వేసిన ఘనత కాంగ్రెస్ సొంతం. అధికారం ఉంది కదా? అని ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిన చరిత్ర దాని సొంతం.. అంతదాకా ఎందుకు.. వైఎస్ఆర్ చనిపోయాగానే.. ఎదురించిన ఆయన కుమారుడు ఇదే వైఎస్ జగన్ ను కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసిన ఘనత ఇదే కాంగ్రెస్ సొంతం. కానీ ఇప్పుడు అవే కేసులు ఎదుర్కోమంటే దేశమంతా లొల్లి.. ఆందోళనలు.. అందుకే అంటారు ‘కాంగ్రెస్ చేస్తేనే సంసారం.. ఇతర పార్టీల నేతలు చేస్తే వ్యభిచారం’.. వాళ్ల దృష్టిలో అంతే మరీ..

-ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసి నిజాయితీ చాటిన అద్వానీ
1996లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు బీజేపీలో వాజ్ పేయి తర్వాత నంబర్ 2గా ఉండి దేశవ్యాప్తంగా ‘శ్రీరామ యాత్ర’ చేసిన అద్వానీని ఓ కేసులో ఇరికించింది. హవాలా కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఏకంగా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి పడేశారు. జైన్ డైరీల వివాదంలో ఆరోపణలు వచ్చిన వెంటనే అద్వానీ ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనమైంది. అది ఎవరి ఒత్తిడి వల్ల చేయలేదు. కేవలం ఆయనే రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. నాడు వాజ్ పేయి ఎంత వారించినా అద్వానీ వినలేదు. రాజీనామా చేయవద్దన్న వినలేదు. ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు నిబద్దత ముఖ్యమని ఈ నిర్ణయం తసీుకున్నారు. బాబ్రీ మసీదు కేసు నమోదైనప్పుడు ఇలానే పదవులు వదలుకున్నారు. మళ్లీ క్లీన్ చిట్ వచ్చాకే బీజేపీలో కొనసాగారు.

-అమిత్ షాను అరెస్ట్ చేయించి జైలుకు పంపిన కాంగ్రెస్ సర్కార్
2005లో గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో నాటి హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలు వచ్చాయి. సోహ్రబుద్దీన్ ఉగ్రవాదిగా మారాడని.. అతడి కార్యకలాపాలతోనే పోలీసులు హతమార్చారని టాక్ నడిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రహోంమంత్రిగా చిదంబరం అయ్యాక ఈ కేసుపై విచారణకు ఆదేశించారు. చార్జీషీటు దాఖలు చేయించి 2010 జూన్ 25న అమిత్ షాను విచారణకు పిలిచి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. షా మూడు నెలల పాటు జైల్లోనే గడిపారు. హోంమంత్రి పదవిని వదిలిపెట్టారు. ఇలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్ లోని సీఎం మోడీని, హోంమంత్రి అమిత్ షాను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి హింసించారు. కానీ ఈ కేసు విషయంలో కాంగ్రెస్ కు తలొగ్గవద్దని.. తాను కోర్టులోనే తేల్చుకుంటానని మోడీకి నాడే జైలు నుంచే అమిత్ షా సందేశం పంపాడు.

-మోడీని గోద్రా అల్లర్లలో వేధించింది ఇదే కాంగ్రెస్ సర్కార్
2002లో మోడీ గుజరాత్ సీఎం అయ్యాక నాడు మతకల్లోల్లాల ‘గోద్రా అల్లర్లు’ జరిగాయి. నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా నాటి కాంగ్రెస్ సర్కార్ కేసులు పెట్టి కోర్టుకీడ్చింది. అయితే నానావతి కమిషన్ లో ఈవిషయంలో నాటి సీఎం మోడీ పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన ప్రోద్బలంతో ఈ అల్లర్లు జరగలేదని.. పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని నివేదిక ఇచ్చింది.

-నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొట్టేసిన అవినీతి కేసులో సోనియా , రాహుల్
స్వాతంత్రం రాక ముందు ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో ప్రబలంగా చాటాలని ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల వద్ద నిధులను సమీకరించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏజేఎల్(అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్) పేరిట నేషనల్ హెరాల్డ్ పత్రిక ను స్థాపించారు. ఏజేఎల్ కంపెనీ కి ఢిల్లీ, యూపీ లో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.అయితే నష్టాలతో అది మూతపడే స్థితికి వచ్చిన వేళ ముద్రణ ఆపేశారు. ఈ సమయంలోనే ఏజేఎల్ కు కాంగ్రెస్ లోని అత్యున్నత స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు రుణాలు ఇస్తూ వస్తోంది. ఈ రుణాలు 2010 నాటికి ₹ 90 కోట్లకు చేరాయి. అయితే ఈ రుణాల విషయంలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏజెఎల్ కంపెనీని దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే రుణాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.ఏజేఎల్ కంపెనీ రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ ₹ఐదు వేల కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఢిల్లీలోని 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో హెరాల్డ్ హౌస్ ఉంది. ఏజేఎల్ కంపెనీకి చెందిన వేల కోట్ల ఆస్తులను కొట్టేయడానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్లాన్ వేశారని, అందులో భాగంగానే ఏఐసీసీ కి చెందిన నిధులను సొంతానికి వాడుకున్నారని 2012లో బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో ఓ ప్రైవేటు కేసు ఫైల్ చేశారు..

నిజానికి అమిత్ షా, అద్వానీ, మోడీలు ఇరుక్కుంది ప్రజాందోళనలు, కాంగ్రెస్ ఇరికించిన అల్లర్ల కేసులు.. కానీ సోనియా, రాహుల్ లది అవినీతి కేసు. ఇక్కడే మనం తేడా గమనించాలి. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షాకు నేరుగా ప్రమేయం లేదు. దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేస్తే ఆయనను ఇరికించారు. దేశంలో అల్లకల్లోలం చేసిన వారిని ఎన్ కౌంటర్ చేస్తే కేసులు పెట్టడం.. అరెస్ట్ చేయడం.. రాష్ట్ర బహిష్కరణ చేస్తే ఇది షా ఢిల్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని రెండేళ్లపాటు తలదాచుకొని కోర్టులో కేసుపై పోరాడాడు. గోద్రా అల్లర్లలో మోడీ ఇన్ వాల్వ్ మెంట్ లేదు. గోద్రాలో రైలు తగులబెట్టిన వారి గురించి మాట్లాడకుండా ఆ తర్వాత ప్రోత్సహించాడని మోడీపై కేసులు పెట్టారు. అలాగే బాబ్రీ కేసులోనూ అద్వానీ ప్రత్యక్ష పాత్రలేదు. ఇవన్నీ రాజకీయ పరమైన కేసులు.. వారు అవినీతికి పాల్పడలేదు. కానీ కాంగ్రెస్, సోనియాలది అవినీతి కేసు.

నాడు అద్వానీ, షా, మోడీలు ఎక్కడా తమను వేధిస్తున్నారని ఆరోపించలేదు. కోర్టులకు ఎక్కలేదు. తమ బీజేపీ నేతలు, కార్యకర్తలతో హంగామా చేయలేదు. మరి ఇప్పుడు సోనియా, రాహుల్ అవినీతి కేసులో ఈడీ విచారణ జరుపుతుంటే కాంగ్రెస్ నేతలతో ఆందోళనలు చేయిస్తూ అట్టుడికిస్తున్నాడు. నాడు నీతితో నిజాయితీతో నిలబడ్డ బీజేపీ నేతలెక్కడ..? అవినీతితో మకిలిపెట్టి యాగీ చేస్తున్న ఈ కాంగ్రెస్ అధినాయకులు ఎక్కడ.? ఇక్కడే ఇద్దరికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను ప్రజలు ఎందుకు చీత్కరించి దూరం పెడుతున్నారో స్ఫష్టమవుతోంది. అవినీతి చేయకుంటే ధైర్యంగా కోర్టుల్లో కేసుల్లో నిలబడాలి. కానీ ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదన్నది కాంగ్రెస్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular