Hyderabad Rains : హైదరాబాద్ డ్రైనేజీ : ఒక్క ఇంజినీర్ కు అయినా బాధ్యత ఉందా?

హైదరాబాద్ లో ఒక్క ఇంజినీర్ కు అన్నా ఎలిజిబిలిటీ లేదన్నది ఇటీవల కట్టిన నిర్మాణాలు చూస్తే తెలుస్తోంది. చింతలకుంట దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్, సబ్ వే, రోడ్లు, అండర్ వే సహా కావాల్సినవన్నీ కట్టేశారు.

Written By: NARESH, Updated On : July 26, 2023 5:38 pm
Follow us on

Hyderabad Rains : ‘హైదరాబాద్ లో కార్లు, వాహనాలు పోయి పడవలు వచ్చాయి.. సికింద్రాబాద్ , కోఠీ అంటూ ప్రయాణికులను పిలుస్తున్నాయి..’ ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటే చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ మునిగిపోతోంది. ఎటు చూసినా వరదనే.. తేలియాడుతున్న కార్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఎంత దౌర్భాగ్యంగా పరిస్థితి ఉందంటే కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, ప్లాన్డ్ గా ప్లాన్ చేసిన సబ్ వేలు కూడా వరదకు మునిగిపోతున్నాయంటే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్న ఒక్క ఇంజినీర్ కు అయినా బాధ్యత లేదన్నది స్పష్టమవుతోంది.

హైదరాబాద్ లో ఒక్క ఇంజినీర్ కు అన్నా ఎలిజిబిలిటీ లేదన్నది ఇటీవల కట్టిన నిర్మాణాలు చూస్తే తెలుస్తోంది. చింతలకుంట దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్, సబ్ వే, రోడ్లు, అండర్ వే సహా కావాల్సినవన్నీ కట్టేశారు. కానీ చింతలకుంట దగ్గర ఏరియాలో సబ్ వే పక్కన.. ఫ్లై ఓవర్ పక్కన మనిషి మునిగేంత నీరు ఈ వర్షాలకు నిలుస్తోంది. అందులోంచి బైక్ తో కానీ.. కారుతో కానీ వెళ్లినా మునగడం ఖాయం. ఇంజినీర్లు ఇంత బాగా కట్టామని తొడలు కొట్టుకున్నారు. కానీ కనీసం డ్రైనేజీ ఎలా వెళుతుంది.? నీరు ఎలా మళ్లుతుందన్న కనీస సృహ మరిచి నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఈ వర్షాలకు చింతల్ కుంట వద్ద ఇటు నుంచి అటు వెళ్లలేని దుస్థితి. ఇదొక్కటే కాదు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని నిర్మాణాలు ఘనంగా కట్టిన ఇంజినీర్లు కనీసం వర్షపు నీరు పోవడానికి.. డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఇది మన ఇంజినీరింగ్ వైఫల్యంగా చెప్పొచ్చు.

హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం వర్షం నీరు వెళ్లేందుకు మార్గం చూపలేకుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం చెరువులను ఆక్రమించడమే. కనుమరుగైన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. దీంతో చెరువుల్లోకి పోవాల్సిన నీరంతా రోడ్లపై చేరుతుంది. స్థానిక సంస్థలు, అధికార యంత్రాంగం, ప్రజల ఉమ్మడి అలసత్వంతో సిటీలోని చెరువులు ఉనికిని కోల్పోయాయి. లేక్స్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు అసలు లేక్సే కనిపించడం లేదు. కొన్నేళ్లకు ఉన్నవి కూడా కనుమరుగు కావడం ఖాయం.

‘గొలుసు కట్టు చెరువుల లింక్‌లు తెగ్గొట్టేశారు. రాత్రికి రాత్రి చెరువులు ఇండ్ల జాగాలైనయ్‌. ఇప్పుడు భారీ వానలకు హైదరాబాద్‌ లాంటి మహానగరమే మునుగుతోంది. చెరువుల కబ్జాలు అడ్డుకొని ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రాష్ట్రంలోని చెరువుల కబ్జాలు తొలగించే చర్యలు తీసుకోండి. కఠినంగా ఉండాలి. కొరడా ఝళిపించాలి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పుడైనా కోఆర్డినేషన్‌తో పనిచేయాలి. అవసరమైతే పోలీసుల్ని వెంటబెట్టుకొని వెళ్లండి. చెరువుల రక్షణకు నడుంబిగించండి. చెరువులకు నీళ్లు ఇచ్చే క్యాచ్‌మెంట్‌ ఏరియాలు, కాలువలు, నాలాలు, కల్వర్టుల రక్షణకు చర్యలు చేపట్టాలి. వాటిపై ఆక్రమణల్ని చట్ట ప్రకారం తొలగించండి’ అని రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నగర అభివృద్ధి నమూనాలో అధ్వానమైన విధానాలతో సిటీ మునుగుతోంది. ప్రకృతి సంపద, పర్యావరణం దెబ్బ తినడంలో పాలకవర్గాల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. నగర పరిధిలోని చెరువు గుర్తింపు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ కోసం లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని క్రితం హైకోర్టు పదేళ్ల క్రితం ఆదేశించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణలు అరికట్టడం, సుందరీకరణ బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంతో చెరువులు కనుమరుగైనా పట్టించుకునేనాథులు లేకుండా పోయారు.

Hyderabad Floods

హెచ్‌ఎండీఏ పరిధిలో 3132 చెరువులు, జీహెచ్‌ఎంసీ చెరువులో పరిధిలో 189 చెరువులు ఉన్నాయి. మొత్తం 3132 చెరువులకు గాను 1000 చెరువులను మాత్రమే లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ గుర్తించింది. ఈ వెయ్యి చెరువుల్లోనూ 224 చెరువులకు మాత్రమే కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 189 చెరువుల్లో 50 చెరువుల ఎఫ్‌టీఎల్‌ను కమిటీ గుర్తించింది. సిటీ వ్యాప్తంగా చాలా చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీ బిల్డింగ్‌లు వెలుస్తున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తుల ఆక్రమణలపైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం వర్షాలకు హైదరాబాద్ లో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది.