Jagan vs Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అసహనం ప్రదర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు వద్దని పవన్ కోరినా కొందరు వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదు. అదే పనిగా పవన్ ను విమర్శిస్తున్నారు. ఆయన వ్యక్తిగత లైఫ్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ సైతం అవే కామెంట్స్ చేయడం విశేషం. కడప జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ సభలో మాట్లాడారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చానని.. అయినా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడంటే తనలా ఉండాలని.. విశ్వసనీయతతో పనిచేయాలని.. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలని జగన్ అన్నారు. రాజకీయాల కోసం దత్తపుత్రుడిగా మారిపోతున్నారంటూ చంద్రబాబు, పవన్ లపై జగన్ కామెంట్స్ చేశారు.

తనది ఒకటే రాష్ట్రం.. ఒకటే పార్టీగా చెప్పుకొచ్చారు. చంద్రబాబులా రాష్ట్రాలు మారనని.. ఏపీలోని 5 కోట్ల మంది మధ్యే రాజకీయం చేస్తానన్నారు. పవన్ మాదిరిగా కాదని.. ఒకే భార్య..ఒకే రాష్ట్రమే తన అభిమతమన్నారు. పవన్ పై జగన్ వ్యక్తిగత కామెంట్స్ కు దిగడం ఇది కొత్త కాదు. చాలా సందర్భాల్లో ఇదే విధంగా మాట్లాడారు. దీనిపై పవన్ రియాక్టయ్యారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని.. అంతదాకా వస్తే తాను చేయగలనని కూడా హెచ్చరించారు. నా వ్యక్తిగత, వైవాహిక జీవితంపై మాట్లాడవద్దని పదే పదే పవన్ కోరుతున్నా వైసీపీ నేతలు మాత్రం అదేపనిగా చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం జగనే ప్రస్తావించేసరికి ఏదో పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేను ఏదైనా చెప్పి చేస్తానని.. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నానని.. కోట్లాను కోట్లు భరణంగా చెల్లించానని.. విడిపోయినా.. వివాహం చేసుకున్నా అవతలి వారి ఇష్టపూర్వకంతో చేశానని కూడా పవన్ ప్రకటించారు. మీలా ఒకర్ని వివాహం చేసుకొని 30 మందిని స్టెప్నీలను పెట్టుకోలేదని కూడా ఎద్దేవా చేశారు. అయినా వైసీపీ నేతలు, సీఎం జగన్ వ్యవహార శైలిలో మార్పు రాలేదు.

అయితే పవన్ పై ఒక వ్యూహాత్మక దాడిని వైసీపీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఏకంగా సీఎం జగనే పవన్ వ్యక్తిగత లైఫ్ గురించి కామెంట్స్ చేసేసరికి.. వైసీపీ బ్యాచ్ ఆయన్ను అనుసరిస్తుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి ఏ చిన్న ఇష్యూను వారు వదలడం లేదు. చివరకు ప్రచార రథం వారాహిపై ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలిసిందే. ఆ రథాన్ని ఏపీలో అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. దీనిపై పవన్ కూడా అంతే స్పీడులో రియాక్టయ్యారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా సీఎం జగన్ వ్యక్తిగత కామెంట్స్ చేయడం కవ్వింపు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ తో పాటు జనసేన శ్రేణులు ఏమాత్రం తొందరపడినా.. ఎటువంటి వ్యాఖ్యలు చేసినా… వాటిని రాజకీయంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ స్ట్రాటజీ మార్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ పవన్ పై కామెంట్స్ డోసు పెంచే అవకాశముందని.. తద్వారా జరిగే ఘటనలతో కొన్ని ఇష్యూలను క్రియేట్ చేయాలని అధికార పార్టీ చూస్తోందని జనసైనికులు కూడా అనుమానిస్తున్నారు. అయితే జగన్ కామెంట్స్ పై పవన్ రియాక్షన్ తరువాతే స్పందించాలని జనసేన శ్రేణులు చూస్తున్నాయి.