Allu Arjun-NTR : సమ్మర్ లో అల్లు అర్జున్-ఎన్టీఆర్ సమరం? బాక్సాఫీస్ కింగ్ ఎవరో?

పుష్ప 2 నార్త్ లో కుమ్మేయడం ఖాయం అంటున్నారు. పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండాలని భావించిన నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 250 నుండి 300 కోట్లు.

Written By: NARESH, Updated On : August 4, 2023 9:30 am
Follow us on

Allu Arjun-NTR : రెండు బడా టాలీవుడ్ మూవీస్ వేసవిలో పోటీపడే సూచనలు కలవు. అవి దేవర, పుష్ప 2గా చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు వారాల వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నారు. చెప్పిన సమయానికి విడుదల చేయాలని నిరవధికంగా షూటింగ్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం పక్కా షెడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.

పూజా కార్యక్రమం రోజే దర్శకుడు కొరటాల చిత్ర కథపై కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇది సాగరతీరం నేపథ్యంలో సాగుతుంది. రాక్షసులను భయపెట్టే యోధుడిగా హీరో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందన్నారు. కథలో హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం కీలకం అన్నారు. అంటే కేవలం సాంగ్స్ కోసమే కాదు. కథను మలుపు తిప్పేలా, ఆమె కేంద్రంగా కూడా దేవర ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జాలరి రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసే అవకాశం కలదంటున్నారు. 2024 ఏప్రిల్ 5న దేవర పాన్ ఇండియా మూవీగా విడుదల కానుందని ప్రకటించారు. అదే ఏప్రిల్ నెలలో పుష్ప 2 విడుదలయ్యే అవకాశం కలదు. పుష్ప 2 టార్గెట్ కూడా సమ్మర్ అంటున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన ఫేమ్ దేశవ్యాప్తమైంది. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా ఉంది.

పుష్ప 2 నార్త్ లో కుమ్మేయడం ఖాయం అంటున్నారు. పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండాలని భావించిన నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 250 నుండి 300 కోట్లు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్. దేవర విడుదలైన ఒకటి రెండు వారాల వ్యవధిలో పుష్ప 2 విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. మరి అదే జరిగితే ఎన్టీఆర్-అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగడం ఖాయం.