Nizamabad: పాపిష్టి డబ్బు కోసం స్నేహానికే మచ్చ తెచ్చాడు.. ఆరుగురుని హత మార్చాడు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ కు చెందిన ప్రశాంత్, పునా ప్రసాద్(36) స్నేహితులు. ప్రసాద్ కు సాత్వికతో (29) పెళ్లయింది. వీరికి చైతు, చైత్ర (7) అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రసాద్ కు పిల్లలు స్వప్న (24), స్రవంతి (22) ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 19, 2023 11:34 am

Nizamabad

Follow us on

Nizamabad: ఉదయం దినపత్రికలు చూడగానే కళ్ళు చెమ్మగిల్లే వార్త కనిపించింది. గుండె చెరువయ్యే దృశ్యం కదలాడింది. ఆస్తికోసం ఆరుగురు హత్య అని శీర్షిక చూడగానే మనసు కకావికలమైపోయింది. అనుబంధాలు కాస్త మనీ బంధాలుగా మారుతున్న ప్రస్తుత కాలంలో కొద్దో గొప్పో నమ్మకం ఉన్న స్నేహం కూడా తానులో ముక్కే అని తేలిపోయింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న స్నేహితుడికి చేయూత అందిస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా.. అతడి కుటుంబాన్ని తోటి స్నేహితుడే తోటి స్నేహితుడే అంతమొందించడం సభ్యసమాజాన్ని నివ్వెర పరుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం యావత్ రాష్ట్రాన్నే కలవరపాటుకు గురిచేస్తోంది. స్నేహితుడిని నమ్మిన పాపానికి అతడు నాతో సహా తన కుటుంబాన్నే కోల్పోయాడు. ఫలితంగా నిన్న మొన్నటి వరకు ఇంటిల్లిపాది సభ్యులతో సందడిగా ఉన్న అతడి గృహం ఇప్పుడు స్మశానం ముందు నిశ్శబ్దంగా మారిపోయింది. 15 రోజుల్లో ఆరుగురు ఒక్కొక్కరుగా హత్యకు గురికావడంతో ఆ కుటుంబం వారి బంధువుల మదిలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ కు చెందిన ప్రశాంత్, పునా ప్రసాద్(36) స్నేహితులు. ప్రసాద్ కు సాత్వికతో (29) పెళ్లయింది. వీరికి చైతు, చైత్ర (7) అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రసాద్ కు పిల్లలు స్వప్న (24), స్రవంతి (22) ఉన్నారు. ప్రసాద్ కు స్వగ్రామంలో చదరపు గజాల చొప్పున స్థలంలో రెండు ఇళ్ళు ఉన్నాయి. రెండున్నర ఎకరాల సాగు భూమి కూడా ఉంది. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ప్రసాద్ బతుకుదెరువు కోసం ఒక ఎకరం పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో దుబాయ్ వెళ్ళాడు. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో అతగాడు ఎంత సంపాదించినప్పటికీ అవి తీరలేదు. సరిగా ఏడో నెల క్రితం తన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. మిగతా పొలం కూడా అమ్మాడు. అప్పటికి అప్పుడు తీరలేదు. ఇక మిగతా ఇండ్లు కూడా అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు ప్రశాంత్ కు చెప్పాడు. అప్పుల వాళ్ళ వేధింపులు ఎక్కువ కావడంతో ప్రసాద్ స్వగ్రామాన్ని విడిచి కామారెడ్డి జిల్లా పాల్వంచకు మారాడు. తల్లి సుశీల, ఇద్దరు సోదరీమణులు, భార్య, పిల్లలతో కలిసి అక్కడే ఉండడం ప్రారంభించాడు. గతంలో ప్రసాద్ ప్రశాంత్ కు ₹ 10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. మరో వైపు నుంచి ఏడు నెలల నుంచి ఖాళీగా ఉండటంతో ప్రసాద్ కు ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. ఇదే అదునుగా ప్రశాంత్ ప్రసాద్ కు మాయ మాటలు చెప్పడం మొదలు పెట్టాడు. నీకు ఇళ్ళ మీద బ్యాంకు లో రుణం ఇప్పిస్తానని.. ఆ రుణం తో నీ అప్పులు తీర్చుకోవచ్చని మభ్య పెట్టాడు. ఆ తర్వాత నీకు పది లక్షల రుణం తిరిగి ఇస్తానని అన్నాడు. ఇలా కొద్ది రోజుల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. అప్పుల వాళ్ళ బాధ ఎక్కువ కావడంతో ప్రసాద్ ప్రశాంత్ ను నిలదీశాడు. ఇదే సమయంలో ప్రశాంత్ తన వక్రబుద్ధితో ప్రణాళిక రూపొందించాడు.

అప్పు తీరుస్తానని చెప్పి ప్రశాంత్ ప్రసాద్ ను రమ్మని కబురు పంపాడు. నవంబర్ 28న తన బండి మీద తీసుకెళ్లాడు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి జాతీయ రహదారి పక్కన హత్య చేసి మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ప్రసాద్ కనిపించకపోవడంతో ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీన్ని అవకాశం గా మలుచుకున్న ప్రశాంత్.. ప్రసాదును పోలీసులు తీసుకెళ్లారని.. వెంటనే మాక్లూరు రావాలని అతడి భార్య సాత్వికకు చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఆమెను నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది వైపు తీసుకెళ్లి అక్కడ ఆమెను చంపి అందులో పడేశాడు. ప్రసాదు తో పాటు సాత్వికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి ప్రసాద్ సోదరీ స్వప్నను డిసెంబర్ 5న మెదక్ జిల్లా చేగుంటలోని వడియారం శివారు తీసుకెళ్లి అక్కడ చంపేసి.. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కాల్చేశాడు. ఇక మరో సోదరిని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లో చంపి మృతదేహాన్ని తగలబెట్టాడు. ఆ తర్వాత సుశీలకు కూడా మాయమాటలు చెప్పి ఆమె బద్ద ఉన్న ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. మృతదేహాలను మూటగట్టి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శివారులోని గోదావరి నదిపై ఉన్న సోన్ బ్రిడ్జి కింద వేరువేరు చోట్ల పడేశాడు..

ఇలా దొరికిపోయాడు

ఈనెల 13న భూంపల్లి శివారులో కాలిపోయిన స్థితిలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభించడం.. దానిపై సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో ప్రశాంత్ ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అధువులకు తీసుకొని విచారణ చేయడంతో ఆరు హత్యల ఘటన వెలుగు చూసింది. అయితే తొలి మూడు హత్యలను తాను చేశానని ప్రశాంత్ ఒప్పుకున్నాడు. మిగతా మూడు హత్యలను తన సోదరుడితోపాటు ముగ్గురి సహకారంతో పూర్తి చేశానని అంగీకరించాడు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కాగా ప్రసాద్, సాత్విక మృతదేహాలు ఇంతవరకు లభించలేదు. మిగిలిన నలుగురు మృత దేహాలను పోలీసులు గుర్తించారు. అయితే సుశీల ఆచూకీ మాత్రం పోలీసులకు లభించకపోవడంతో..ఆమెను కూడా ప్రశాంత్ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మరికొద్ది సేపట్లో కామారెడ్డి పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రశాంత్ కేవలం ప్రసాద్ ను మాత్రమే కాకుండా గతంలో చాలామందిని మోసం చేసినట్టు మాక్లూరు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామానికి చెందిన అశోక్, సాయిలు అనే పేద రైతులకు భూమిపై రుణాలు ఇప్పిస్తానని ప్రశాంత్ నమ్మించాడు. ఇద్దరికీ లక్ష చొప్పున ఇచ్చి చలో 6 ఎకరం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వీరిలో ఒకరి పొలాన్ని 15 లక్షలకు అమ్ముకున్నాడు. ఈ విషయమై ఇరువు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలోనే అతడు ఏడు నెలల నుంచి ఊరికి దూరంగా నిజామాబాద్ శివారు ప్రాంతంలో ఉంటున్నాడు.