Tiger Deaths In Thailand Zoo: సాధారణంగా మనుషుల కంటే జంతువుల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అంటారు. మనుషుల మాదిరిగా జంతువులు ఇష్టానుసారంగా తినవు. వాటి లైఫ్ సైకిల్ ఆధారంగానే ఆహారాన్ని స్వీకరిస్తాయి. అలాగే ఇతర దేహ సంబంధమైన కార్యకలాపాలలో పాల్గొంటాయి. అందువల్లే జంతువులు ఆరోగ్యంపరంగా దృఢంగా ఉంటాయి.
జంతువులలో దృఢంగా ఉండే వాటిల్లో పులులు మొదటి స్థానంలో ఉంటాయి.. పులులు మాంసాహార జంతువులైనప్పటికీ.. ఆకలి వేస్తేనే వేటాడుతుంటాయి. ఆకలిగా లేనప్పుడు నిర్మానుషమైన ప్రాంతాలలో విశ్రాంతి తీసుకుంటాయి. పైగా పులులకు కొన్ని భౌగోళిక పరమైన సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల్లోనే పులులు వేటను కొనసాగిస్తుంటాయి. ఒకవేళ ఒక పులి పరిధిలోకి మరొక పులి వస్తే అక్కడ రణం జరుగుతూ ఉంటుంది.
అడవుల్లో ఉండే పులుల తీరు ఇలా ఉంటే.. పార్కులలో ఉండే పులుల తీరు మరొక విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. కానీ, వాటి చుట్టూ కంచె ఉంటుంది. అందులోనే వాటికి జూ నిర్వాహకులు మాంసం వేస్తూ ఉంటారు. జూలో ఉండే పులులు క్రూరత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటాయని.. దాడి చేసే స్వభావాన్ని తీవ్రంగా చూపిస్తాయని జంతు పరిశోధకులు అంటుంటారు.
థాయిలాండ్ ప్రాంతంలోని ప్రైవేట్ పార్కులో సంరక్షణ పొందుతున్న పులులు ఉన్నట్టుండి చనిపోయాయి. ఏకంగా 70 కి పైగా పులులు మృత్యువాత పడ్డాయి. కేవలం రోజుల వ్యవధిలోనే 72 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పులుల కళేబరాల నమూనాలను పరీక్షించారు. పులుల్లో కనైన్ డిస్టెంపెర్ వైరస్ (సిడివి) కారణంగా పులులు చనిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్ భయంకరమైనదని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన పులులు ఆహారాన్ని తీసుకోలేవు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటాయి. ఆహారం తీసుకోక పోవడం వల్ల పులులు రోజుల వ్యవధిలోనే చనిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. పులులు చనిపోయిన నేపథ్యంలో నిర్వాహకులు తాత్కాలికంగా ఆ పార్కును మూసివేశారు. సంరక్షణ చర్యలు మొదలుపెట్టారు.
ఏకంగా 72 పులులు చనిపోవడంతో.. అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ ఎక్కడి నుంచి సోకింది? రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నప్పటికీ పులులు ఎలా చనిపోయాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.