Ushannapalli Village: ఒక ఊరు.. రెండు నెలలుగా శోకాలు పెడుతూనే ఉంది. వల్లకాడులు మండుతూనే ఉన్నాయి. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు చనిపోతున్నారు. ఇలా ఈ గ్రామంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 15 మంది కన్నుమూశారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ విషాదం నుంచి తేరుకోవడానికి అక్కడి ప్రజల వల్ల కావడం లేదు.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ గ్రామంలో 15 మంది చనిపోవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇలా 15 మంది చనిపోవడాన్ని అక్కడికి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం ఉషాన్న పల్లి గ్రామంలో ఈ వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు తమ ఊరికి ఏదో కీడు సోకి ఉంటుందని భయపడిపోతున్నారు. కనీసం ఇళ్లల్లో పోయి కూడా వెలిగించడం లేదు. పొద్దంతా ఇండ్లకు తాళాలు వేసే ఉంటున్నారు. ఊరి బయట ఉన్న తోటలోకి వెళ్తున్నారు. అక్కడే వంట చేసుకుని తిని సాయంత్రం పూట మళ్లీ ఇంటి బాట పడుతున్నారు. ఇలా చేయడంవల్ల గ్రామంలో చావులు ఆగిపోతాయని అక్కడి గ్రామస్తులు భావిస్తున్నారు. అలా చేసినప్పటికీ గ్రామాలలో చావులు ఆగడం లేదు.
చనిపోయిన 15 మంది లో రకరకాల వయసులకు చెందిన వారు ఉన్నారు. కొందరు అనారోగ్యంతో చనిపోతే.. మరికొందరేమ ప్రమాదాల వల్ల.. ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు.. అయితే వారంతా చనిపోవడం వెనక వేరువేరు కారణాలు ఉన్నాయి. ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నట్టుగా అక్కడ కీడు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు అంటున్నారు. మనిషి పుట్టడం ఎంత సహజమో.. చనిపోవడం కూడా అంతే సహజమని.. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మడం ఎంతవరకు సమంజసమని చుట్టుపక్కల గ్రామాల విద్యావంతులు పేర్కొంటున్నారు. ఉదయం పూట గృహాలకు తాళాలు వేయడం.. సమీపంలో ఉన్న తోటలకు వెళ్లి భోజనం వండుకొని రావడం అక్కడికి గ్రామస్తులకు అలవాటుగా మారింది.
ఇక్కడ గ్రామస్తులు వరస మరణాలను చూసి భయపడుతున్నారు. అంతేకాదు గ్రామానికి ఎవరో మంత్రాలు చేశారని.. చేతబడి ద్వారా గ్రామంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో ఇవి గ్రామస్తుల మధ్య దాడులకు దారితీస్తున్నాయి. అయితే ఇక్కడ గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వీరిలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది.
