NATS Volunteers Food Bank Service: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మిస్సోరి చాప్టర్ అనాథలకు, చిన్నారులకు, వృద్ధులకు సేవ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా బ్రిడ్జన్లోని సెయింట్ లూయిస్ ఏరియా ఫుడ్ బ్యాంక్లో అరుదైన సేవా కార్యక్రమం నిర్వహించింది.. సుమారు 30 మంది తెలుగు వాలంటీర్లు కేవలం రెండు గంటల వ్యవధిలోనే 5,766 పౌండ్ల(సుమారు 2.62 టన్నుల) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాకింగ్ పూర్తి చేశారు. ఈ భారీ మొత్తంతో ఆహారం ఇప్పుడు పేద, నిరుపేద కుటుంబాలకు పంపిణీకి సిద్ధంగా ఉంది.
నాయకత్వం, సమన్వయం..
ఈ కార్యక్రమ విజయానికి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల కీలకపాత్ర పోషించారు. వీరితోపాటు మధుసూధన్ దద్దాల, నరేశ్ రాయంకుల తదితర సభ్యులు చురుకైన పాత్ర పోషించారు. నాట్స్ చైర్మన్ కిశోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందడి వాలంటీర్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

స్థానిక ఆహార భద్రతపై ప్రభావం
సెయింట్ లూయిస్ ఏరియా ఫుడ్ బ్యాంక్ ప్రతి నెలా 80కి పైగా ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తూ, లక్షలాది మందికి ఆసరాగా నిలుస్తోంది. నాట్స్ వాలంటీర్లు సిద్ధం చేసిన ఈ 3 టన్నుల ఆహారం స్థానికంగా ఆహార కొరత ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయమైన ఊరటనిస్తుంది. తక్కువ సమయంలోనే ఇంత భారీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం పట్ల ఫుడ్ బ్యాంక్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
‘భాషే రమ్యం, సేవే గమ్యం‘ అనే నినాదంతో ముందుకు సాగుతున్న నాట్స్, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో స్థానిక సమాజానికి అండగా ఉంటామని మిస్సోరి చాప్టర్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం తెలుగు సమాజం సామాజిక బాధ్యతను, సేవా దృక్పథాన్ని చాటుకుంది.