Ayodhya Ram Mandir: బాల రాముడి ఆభరణాలు ఎవరు తయారు చేశారు? వాటి విలువ ఎన్ని కోట్లు అంటే?

వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని బాల రాముడి నుదుటిపై దిద్దారు. ఆయన మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్రవైడూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు. రామ్‌ లల్లా పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. ఆయన మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని అలంకరించారు.

Written By: Raj Shekar, Updated On : January 23, 2024 4:05 pm
Follow us on

Ayodhya Ram Mandir: కోట్లాది ప్రజల భారతీయుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌ లల్లాకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా సర్వాంగ సుందరంగా స్వర్ణాభరణాలంకృతుడైన బాల రాముడిని చూసి యావత్‌ దేశం పులకించింది. రాముని రూపాని కనులారా వీక్షించి.. మదినిండుగా నిక్షిప్తం చేసుకున్నారు. నిజంగా చిన్ని రామయ్యే ప్రేమగా చూస్తున్నట్లుగా భావిస్తున్నారు. జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కారు. వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు ఆభరణాల అలంకరణతో బాల రాముడు మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు.

అలంకరణ ఆభరణాలు ఇవీ..
వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని బాల రాముడి నుదుటిపై దిద్దారు. ఆయన మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్రవైడూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు. రామ్‌ లల్లా పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. ఆయన మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని అలంకరించారు. నడుముకు వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన వడ్డాణం ధరింపజేశారు. ఇక చేతిలో ధనుర్భాణాలు, పట్టు పీతాంబరాలు ధరించి మరోసారి అయోధ్యను ఏలేందుకు వచ్చిన యువరాజులా బాల రాముడు దర్శనమిస్తున్నాడు.

ఆభరణాల కోసం ప్రత్యేక కసరత్తు..
బాల రాముడికి అలంకరించిన ఆభరణాల వెనుక ఓ స్టోరీ ఉంది. ఎంతో పరిశోధన చేసి అధ్యయనాలు జరిపి ఆభరణాలను తీర్థక్షేత్ర ట్రస్టు తయారు చేయించింది. బాల రాముడికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలనే విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చాలా కసరత్తే చేసింది. ఇందుకోసం ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, అలవందర్‌ స్తోత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటి పరిశోధన తర్వాతనే బాల రాముడికి అలంకరించే ఆభరణాలు తయారు చేయించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది.

ఎవరు తయారు చేశారంటే..
బాల రాముడి ఆభరణాలను ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని అంకుర్‌ ఆనంద్‌కు చెందిన హర్‌సామైమల్‌ షియాంలాల్‌ జ్యువెల్లర్స్‌ వారు ఆభరణాలను డిజైన్‌ చేశారు. ముందుగా రామ్‌ లల్లాను బనారసీ వస్త్రంతో అలంకరించారు. పసుపు పచ్చ పంచెతోపాటు ఎరుపు రంగు అంగవస్త్రాన్ని ధరింపజేశారు. ఈ అంగవస్త్రాలను బంగారు వర్ణపు జరీతో తయారు చేశారు. దానిపై శంఖం, చక్రం, పద్మం, మయూర్‌లను ముద్రించారు. ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన డిజైనర్‌ మనీశ్‌ త్రిపాఠి స్వయంగా అయోధ్యలో ఉండి రూపొందించారు.

విలువ ఎంతంటే..
అయోధ్య రామ్‌లల్లా విగ్రహానికి అలంకరించిన బంగారు కిరీటం విలువ రూ.11 కోట్లు అని ఆలయ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, గ్రీన్‌ ల్యాబ్‌ డైమండ్స్‌ అధినేత ముకేశ్‌ పటేల్‌ ఈ కిరీటాన్ని అందించారు. 6 కిలోల బరువు ఉన్న ఈ కిరీటంలో అత్యంత విలువైన రాళ్లను పొదిగారు. 4.5 కేజీల బంగారంతోపాటు చిన్నాపెద్ద వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమణులతో తయారు చేశారు. సూరత్‌కు చెందిన కుషాల్‌దాస్‌ జువెల్లర్స్‌ యజమాని దీపక్‌ చోక్సీ మూడు కిలోల వెండి రామ మందిర నమూనాలు తయారు చేసి అందించాడు.

– ముకుట్‌ అని పిలిచే రాముడి కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారు చేశారు. మరో అరకిలో బంగారంతో కిరీటం వెనుక, చుట్టూ ఉండే హోలోను రూపొందించారు. ఈ కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్‌ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. ఆ ముకుట్‌ మధ్యలో శ్రీరాముడి వంశమైన సుర్యవంశీ లోగోను ముద్రించారు.

– ఇక సుమారు 16 గ్రాములు ఉండే బాల రాముడి తిలకంలో 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు ఉంచారు.

– ఉంగరాల విషయానికి వస్తే బాల రాముడి కుడి చేతి ఉంగాన్ని 4 క్యారెట్ల వజ్రాలు, 33 పచ్చలు, 65 గ్రాముల బంగారంతో తయారు చేశారు. ఎడమ చేతి ఉంగరాన్ని 26 గ్రాముల రూవీ రింగ్‌లతో తయారు చేసి కెంపులు, వజ్రాలు పొదిగారు.

– బంగారంతో చేసిన చిన్న గుండ్రని నెక్లెస్‌ 500 గ్రాముల బరువు ఉంది. ఇందులో 50 కారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు.

– ఇక రామ్‌ లల్లా నడుము పట్టీని 750 గ్రాముల బంగారంతో తయారు చేయించారు. ఇందులో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు.

– 850 గ్రాముల బరువైన చేతి కడియాలను 22 క్యారెట్ల బంగారంతో చేశారు. ఇందులో కూడా 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. 400 గ్రాముల బంగారంతో వజ్రాలు, కెంపులతో కాళ్లకు కడియాలు తయారు చేశారు.