Karnataka Elections 2023 : కర్ణాటకలో అంతటి బలమైన మోడీని కాంగ్రెస్ ఎలా ఓడించింది?

ఇవన్నీ పరిణామాలు, ఇంత మంది నేతల పకడ్బందీ కృషి పట్టుదల , పగ ప్రతీకారాలు కూడా బీజేపీని ఓడించడానికి ఆస్కారం కల్పించాయి. ప్రజల్లోనూ బీజేపీపై వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపునకు సోపానం అయ్యింది.

Written By: NARESH, Updated On : May 13, 2023 6:23 pm
Follow us on

Karnataka Elections 2023 -BJP Modi  : ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సరే.. సరైన వ్యూహం.. సన్నద్ధత, తంత్రం ఉంటే ఎవ్వరినైనా ఓడించవచ్చు. సినిమా అయినా కూడా లక్ష సైన్యం ఉన్న కాలకేయుడిని వేల సైన్యమే ఉన్న బాహుబలి ఓడించినట్టు ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన మోడీని కాంగ్రెస్ ఓడించడం సంచలనమైంది. అంతటి మోడీని ఓడించింది కేవలం ఇద్దరు. వాళ్లే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ మాజీ సీఎం సిద్ధిరామయ్య. వీరిద్దరి పక్కా ప్రణాళిక, వ్యూహాల ముందు మోడీ ఓడిపోయారు.

బలమైన మోడీ ధాటికి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. ప్రతీ ఎన్నికల్లోనూ ఓడిపోతూనే ఉంది. డిసెంబర్ 2022లో హిమాచల్ ప్రదేశ్ లో విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు కల్పించింది. అక్కడి నుంచే మోడీని బీజేపీని ఓడించగలమన్న ధైర్యం వచ్చింది. ఈ నిశ్శబ్ద విప్లవం మొదలైంది. మోడీని మించి వ్యూహాలు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక ప్రచారం.. కీలకమైన కర్ణాటక విజయానికి వారు ఉపయోగించిన సోషల్ మీడియాతో సహా వ్యూహాత్మక కమ్యూనికేషన్ ప్రచారం ఎంతో ఉపకరించింది.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బలమైన ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ సహా బీజేపీ శక్తుల ప్రచారం ముందు కాంగ్రెస్ నిలబడదని అనుకున్నారు. కానీ అంతకుమించిన ప్రచారంతో ఈ క్లిష్టమైన ముఖాముఖిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలించే అంశాలు చాలా తోడ్పడ్డాయి.

కర్ణాటకలో మోడీ మతాన్ని నమ్ముకొని ‘భజరంగదల్’ వివాదాన్ని రాజేశారు. కానీ కర్ణాటక సమస్యలపై దృష్టి సారించకపోవడం ప్రధాన లోపం.. కాంగ్రెస్ ఇదే చేసింది. ఉచిత విద్యుత్, రోడ్లు , నీటి పారుదల కల్పిస్తామని అతి పెద్ద వాగ్ధానం చేసింది. ప్రజల ఆకలితీర్చే సమస్యలపై హామీలు ఇచ్చింది. సిద్ధరామయ్య ఇక కర్ణాటకలోని పేద ప్రజల్లో కాంగ్రెస్‌కు ఐకాన్‌గా ఉన్న అట్టడుగు నాయకుడిగా ఉన్నారు. ఇతర ప్రముఖులైన డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ లో బలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్యతో పదేపదే పోటీ ఉన్నప్పటికీ బీజేపీని ఓడించాలన్న పట్టుదల వీరిద్దరినీ కలిపింది.

బీజేపీ సీఎం బొమ్మై నేతృత్వంలోని బిజెపిని కాంగ్రెస్ అవినీతితోనే కొట్టింది. ప్రతి రాష్ట్ర ప్రాజెక్ట్‌లో “40 శాతం అవినీతి కమీషన్లు” బీజేపీ నేతలు తీసుకున్నారని హైలైట్ చేస్తూ సందేశాత్మక ప్రచారాన్ని నిర్వహించింది. డీకే శివకుమార్ ముఖ్యంగా కాంగ్రెస్ లో అసమ్మతిని తగ్గించాడు. ఎమ్మెల్యే అభ్యర్థులకు భరోసా కల్పించాడు. వారు బీజేపీ వైపు పోకుండా బలమైన అభ్యర్థులను కాపు కాశాడు. కాంగ్రెస్ నుంచే నిలబెట్టాడు. భారతీయ జనతా పార్టీ ఎన్ని బెదిరింపులు చేసినా.. స్వయంగా డీకేను కేసుల్లో ఇరికించి జైలుకు పంపినా కూడా లెక్కచేయకుండా బీజేపీని ఓడించాలన్న కసితో డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలతో కలిసి ధైర్యంగా నిలబడడం ప్రజలకు కూడా కాంగ్రెస్ పై నమ్మకం కలిగించింది.

కర్నాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా కూడా రాష్ట్రంలో పార్టీని, నేతలను సమన్వయంతో ముందుకు నడిపించడంలో బీజేపీ కంటే ముందే ప్రారంభించి సక్సెస్ అయ్యారు., అక్కడే కొన్ని నెలలుగా మకాం వేసి మరీ బిజెపిని చావు దెబ్బకొట్టాడు. ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణతో కూడిన ప్రచారం కోసం ఆయన ఇద్దరు ప్రాంతీయ నేతలైన డీకే శివ, సిద్ధిరామయ్యలను ఒక్క గాటిన కట్టడమే విజయ రహస్యంగా మారింది. “మొదట మనం కలిసి ఎన్నికల్లో గెలవాలి అప్పుడు మాత్రమే ఎవరైనా సిఎం కాగలరు” అని సూర్జేవాలా సూటిగా వారిద్దరికీ చెప్పి ఒప్పించి కల్పించి కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేయించి విజయతీరాలకు చేర్చాడు.

ఇవన్నీ పరిణామాలు, ఇంత మంది నేతల పకడ్బందీ కృషి పట్టుదల , పగ ప్రతీకారాలు కూడా బీజేపీని ఓడించడానికి ఆస్కారం కల్పించాయి. ప్రజల్లోనూ బీజేపీపై వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపునకు సోపానం అయ్యింది.