CAA: ఆ దేశాల నుంచి వచ్చిన వారికే భారత పౌరసత్వం.. సీఏఏ రూల్స్ లో ఇంకా ఏమున్నాయంటే?

గత ఏడాది హైదరాబాదులో ఓ వ్యక్తి ఓ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్నాడని సమాచారం అందడంతో.. కేంద్ర నిఘా సంస్థలు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించాయి. అయితే ఆ వ్యక్తి పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉగ్ర దాడులకు రూపకల్పన చేస్తున్నాడని తేలింది.

Written By: Suresh, Updated On : February 28, 2024 3:51 pm

CAA

Follow us on

CAA: హైదరాబాదులో ఆ మధ్య ఒక ప్రాంతంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన అధికారులపై రోహింగ్యాలు దాడులు చేశారు. ఆ తర్వాత అధికారులు వారు ఉంటున్న ఇండ్లలో సోదాలు చేయగా.. ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. పైగా వారు పశ్చిమ బెంగాల్ మీదుగా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు గుర్తించారు.

గత ఏడాది హైదరాబాదులో ఓ వ్యక్తి ఓ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్నాడని సమాచారం అందడంతో.. కేంద్ర నిఘా సంస్థలు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించాయి. అయితే ఆ వ్యక్తి పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉగ్ర దాడులకు రూపకల్పన చేస్తున్నాడని తేలింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు మన దేశంలో కోకొల్లలు. అందుకే ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తోంది.

2019లోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు కేంద్రం దానిని ముట్టుకోలేదు. కానీ ఇటీవల కొంతమంది బిజెపి నాయకులు సీఏఏ (citizen amendment act) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని కేంద్రం కచ్చితంగా అమలు చేస్తుందని ప్రకటించారు. వారు చెప్పిన విధంగానే కేంద్రం కూడా మరోసారి సీఏఏ (citizen amendment act) అమలు వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

మార్చి నెల నుంచి దీనిని అమలు చేస్తుందని, ఎన్నికల కోడ్ తెరపైకి రాకముందే సీఏఏ (citizen amendment act) పూర్తిచేస్తుందనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఏఏ (citizen amendment act) మార్పుల విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేందుకు ఒప్పుకోవడం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. మన దేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్న ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు, జైనులు (ముస్లిమేతర శరణార్థులు) మాత్రమే భారత పౌరసత్వం పొందడానికి అర్హులని ఆ మధ్య కేంద్రం చెప్పడంతో.. ముస్లింలు మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం వివక్ష చూపిస్తోందని, రాజ్యాంగంలో లౌకిక సిద్ధాంతాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.. 2019లో CAA (citizen amendment act), NRC(national registration of citizens), NPR(national population registration) పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కొవిడ్ నేపథ్యంలో అప్పట్లో ఈ నిరసనలు సద్దుమణిగాయి.

సీఏఏ (citizen amendment act) కు సంబంధించి కేంద్రం రూ పొందించిన ఆన్ లైన్ పోర్టల్ సిద్ధంగా ఉందని, ఇప్పటికే డ్రై రన్ పూర్తి చేసినట్టు సమాచారం. అప్పట్లో సీఏఏ (citizen amendment act)కు నుంచి ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు కనిపించినప్పటికీ.. తెర వెనుక కేంద్రం వేగంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. గడచిన రెండు సంవత్సరాలలో (పౌరసత్వ చట్టం 1955 ప్రకారం) ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాక్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 30 మంది జిల్లా మెజిస్ట్రేట్ లు, హోంశాఖ కార్యదర్శులకు కేంద్రం పలు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2021 నుంచి, డిసెంబర్ 31, 2021 వరకు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాక్ నుంచి మొత్తం 1,414 మంది ముస్లిమేతర మైనార్టీలకు (భారతీయ పౌరసత్వ చట్టం 1955 ప్రకారం) భారతీయ పౌరసత్వం దక్కింది.

కాగా, త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీఏఏ (citizen amendment act)ను కేంద్రం తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఓ వర్గం వారిని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల లౌకిక స్ఫూర్తి దెబ్బతింటుందని, రాజ్యాంగంలో మౌఖిక సూత్రాలకు అర్థం ఉండదని ధ్వజమెత్తుతున్నాయి. కాగా ఎన్నికల కోడ్ రాకముందే సీఏఏ (citizen amendment act)ను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. గతంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో మరి.