Ram Mandir: ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారత్ దేశం మొత్తం రామనామం జపిస్తోంది. ప్రతి ఒక్క హిందువు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అవకాశం వచ్చిన కొందరు అయోధ్యకు చేరగా.. మిగతా వారు వివిధ మార్గాల ద్వారా రాముడు కొలువుదీరే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయోధ్యకు సంబంధించిన ఎన్నో కథనాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆలయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయోధ్య రామ మందిరం ఆలయ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యేళ్ల పాటు నిలిచి ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఇసుక నేల అయినా భూకంపాలను తట్టుకొని నిలబడే విధంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా నేటి కాలంలో ఆలయంలో సిమెంట్, ఉక్కు వాడడం సహజం. కానీ అయోధ్య ఆలయ నిర్మాణంలో మాత్రం ఎక్కడా ఇనుమును వాడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ మందిరం నిర్మాణానికి మొత్తం నాపరాయి, పటిష్టమైన రాతినే ఉపయోగించారు. ఈ రాళ్లను వరుస క్రమంలో పేర్చి నిర్మించారు.
ఇంతటి గొప్ప కట్టడాన్ని సందర్శించేందుకు ఇక్కడి ప్రభుత్వం మంగళవారం నుంచి సాధారణ భక్తులను అనుమతి ఇవ్వనుంది. కానీ ఇంతలోనే ఆలయం లోపలి దృశ్యాలు బయటకు వచ్చేశాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పూలతో అలంకరించారు. అక్కడక్కడా ఓంకారం, స్వస్తిక్ గుర్తులను పూలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఈ ఆలయంలోపలి దృశ్యాలను వీడితో తీశారు.
ఈ వీడియోలో ఆలయంలోపలి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తున్నాయి. ఆలయ స్తంభాలను చూస్తే పురాతన కాలంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన వారు అయోధ్యకు వెళ్లకుండా రామ మందిరం చూశామన్న తృప్తి కలిగిందని కొందరు కామెంట్లు చేయడం విశేషం. ఆ వీడియోను మీరు కూడా చూసి తరించండి..