Site icon OkTelugu

సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపులో ఆంతర్యమేమిటి?

CS Adityanathఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆయన మరో ఆరు నెలల పాటు అదనపు పదవీ కాలం పొందబోతున్నారు. ఇప్పటికే మహారాష్ర్ట ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సీఎస్ సేవల్ని మరికొంత కాలం వాడుకోవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ చేసిన వినతిని కేంద్రం ఆమోదముద్ర వేసింది.

గతేడాది డిసెంబర్ 31న ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. జనవరి 1 నుంచి ఆయన పదవీ కాలం అమల్లోకి వచ్చింది. అయితే ఆయన ఈనెల30వ తేదీతో రిటైర్ కానున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపిక కంటే ఆయన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ కుటుంబానికి విధేయుడు కావడంతో సీఎం జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు మరో ఆరునెలలు పొడిగింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. సీఎం జగన్ మొన్నటి ఢిల్లీ పర్యటనలోనూ హోంమంత్రి అమిత్ షాను ఈమేరకు విన్నవించినట్లు తెలిసింది.

సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నందున ఆ తరువాత ఆరునెలల పదవీకాలం పొడిగింపు అమల్లోకి వస్తుంది. అయితే తొలుత మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తరువాత మరో మూడు నెలల ఎక్స్ టెన్షన్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ నిబంధనల మేరకు ఈ పొడిగింపు మూడు నెలల చొప్పున అమల్లోకి వస్తుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సీఎస్ గా ఆదిత్యనాథ్ కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఆదిత్యనాథ్ పదవీకాలం పొడిగించవద్దని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్ నిందితుడిగా ఉన్నారని, ప్రజాసంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్ కు లిమిటెడ్ కు నిబంధనలకు విరుద్దంగా పది లక్షల లీటర్ల నీటికి కేటాయించారన్నారు.

Exit mobile version