గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఆమె మేయర్ గా నియమితులయ్యారు. సీనియర్ నేత కే కేశవరావు కుమార్తె ఈమె. సీఎం కేసీఆర్ కు చాలా దగ్గరి సీనియర్ నేత కావడంతో ఈమెకే కేసీఆర్ పట్టం కట్టారు.
విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ మేరకు ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆమె విజయం సాధించారు.
మేయర్ అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపించాయి. పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ప్రధానంగా మేయర్ అవుతారని అనుకున్నారు. ఇక సింధూ ఆదర్స్ రెడ్డి పేరు కూడా టీఆర్ఎస్ తరుఫున వినిపించింది. కానీ కేసీఆర్ చివరకు తనకు ఉద్యమం నుంచి తోడుగా ఉన్న కేకే కుమార్తెకే ఆ పదవి కట్టబెట్టారు.
సామాజిక సమీకరణాల లెక్కనే కేకే కూతురును కేసీఆర్ మేయర్ గా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంఐఎం కార్పొరేటర్లు మద్దతు పలకడం విశేషం. టీఆర్ఎస్ కు సొంతంగా 56 మంది కార్పొరేటర్లు ఉండగా.. 44 మంది ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠం టీఆర్ఎస్ వశమైంది.
నిజానికి ఎంఐఎం మద్దతు ఇస్తే డిప్యూటీ మేయర్ వారికి పోతుందని అంతా భావించగా అది కూడా టీఆర్ఎస్ కే దక్కడం విశేషం. తార్నాకా డివిజన్ నుంచి ఎన్నికైనా శ్రీలతా రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగినా తగిన బలం లేక చతికిలపడ్డారు.