Homeఅత్యంత ప్రజాదరణఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ సర్కారు ఉద్యోగులు

ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ సర్కారు ఉద్యోగులు

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్19 ఇప్పుడిప్పడే అదుపులోకి వస్తోంది. వ్యాక్సిన్ రాకతో ప్రతీ ఒక్కరికీ టీకా వేసేలా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులు చురుగ్గా పాల్గొంటున్నారు. రెండుదశలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ కార్యాలయాల్లో సుమారు 8 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడానికి కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు ఒక్క ఆరోగ్యశాఖ మాత్రమే కాదు.. అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధం కావడం, ఉద్యోగులపై ఎన్నికల విధుల భారం మోపడం అంటే వారి ప్రాణాలను బలి పెట్టడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: జనసేన వర్సెస్ బీజేపీ.. తిరుపతి ఎవరిది?

దేశంలో కరోనా సెకండ్ వేవ్లో సైతం కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటికీ సగటున రోజుకు 200 కేసులు పైనే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి టీకా రావడం ఊరటనిచ్చినా స్థానిక ఎన్నికల ప్రక్రియతో గందరగోళం నెలకొంది. ఒకవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుండగా మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌కు సిద్ధం కావడం వైద్య నిపుణులు, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు పైబడిన వారు ఓటింగ్‌కు రావడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కేరళాలోనూ ఎన్నికలు జరిగిన తరువాతే.. కోవిడ్ కేసులు పెరిగాయని గుర్తుంచుకోవాలని ఉద్యోగులు సూచిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది ఉద్యోగులు.. ఎన్నోరోజులు కష్టపడాలి. ముందుగా ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పోలీసులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఎన్నికల విధుల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే గ్రామాల్లో ప్రచారం.. గుంపులు.. గుంపులుగా తరగడం.. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన లాంటివి ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో వైరస్ మళ్లీ కోరలు చాచే అవకాశం ఉంటుంది.

Also Read: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరిన్ని సిటీ బస్సులు…?

మరోవైపు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్ల పర్యవేక్షణ అంతా వ్యాక్సినేషన్‌పైనే ఉంది. ఒక కేంద్రంలో ఒకరోజు వ్యాక్సిన్‌ వేస్తే దాన్ని ఒక సెషన్‌ అంటారు. అలా 40 వేలకుపైగా సెషన్స్‌ వేయాల్సి ఉంది. ఒక్కో సెషన్‌కు 10 నుంచి 12 మందికి పైగా సిబ్బంది అవసరమున్నట్టు ఆరోగ్య శాఖ తేల్చింది. వీరంతా ఒకవైపు తమ విధులను నిర్వర్తిస్తూనే అదనంగా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 17న జరగాల్సిన పోలియో కార్యక్రమాన్ని సైతం కేంద్రం వాయిదా వేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించాలనడం ప్రాణ సంకటమేనని అధికారులు పేర్కొంటున్నారు. పైగా ఫిబ్రవరి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌కు పంచాయితీ, రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాలను ఇప్పటికే సిద్ధం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు కోవిడ్‌ నేపథ్యంలో బయటకు రాకూడదు. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటు వేసేందుకు బయటకు వస్తారు. వ్యాక్సిన్‌ తీసుకోకుండా వారంతా పెద్ద సంఖ్యలో బయటకు వస్తే పెద్దల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular