Homeఎడ్యుకేషన్TSPSC Paper Leak : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ: ఒకరి నుంచి మరొకరికి చేతులు...

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ: ఒకరి నుంచి మరొకరికి చేతులు మారిందిలా..

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల వ్యవహారం.. నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది..ఈ వ్యవహారంలో పరీక్ష పేపర్లు కొందరు వ్యక్తులకు మాత్రమే లీక్‌ కాలేదు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఇవి చేరాయి. ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన అభ్యర్థులు.. అందుకు తాము వెచ్చించిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలనే ఆలోచనతో ఆ పేపర్‌ను మరొకరికి విక్రయించారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇంకొకరికి విక్రయిస్తూ వెళ్లడంతో ఇది మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌లా మారింది. ఇలా చైన్‌ సిస్టమ్‌లో సాగిన ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. లీకేజీ గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌, ఢాక్యా నాయక్‌, రాజేశ్వర్‌లను సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. గత శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలంలోని నేరళ్లచెరువు గ్రామానికి చెందిన రాజేందర్‌కుమార్‌ అనే యువకుడిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఇతని ద్వారా తిరుపతయ్య అనే మరో పేరు బయటికి వచ్చింది.

రాజేందర్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేసి ఓ ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిన సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్లకు ఉపాధి హామీలో క్వాలిటీ కంట్రోల్‌ అధికారిగా చేరాడు. ఈ సమయంలోనే అతనికి మహబూబ్‌నగర్‌ జిల్లా బాల్‌నగర్‌ మండలం గండేడుకు చెందిన తిరుపతయ్యతో పరిచయమైనట్లు సమాచారం. రాజేందర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుకు ప్రిపేర్‌ అయ్యేందుకు దిల్‌సుక్‌నగర్‌లో కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరగా.. తాను పరీక్ష పశ్నపత్రాన్ని ముందుగానే ఇస్తానని, ఇందుకు రూ.10 లక్షలివ్వాలని తిరుపతయ్య చెప్పినట్లు తెలిసింది. దీంతో రాజేందర్‌కుమార్‌ ముందుగా రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా డబ్బు ఫలితాల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. నవాబ్‌పేట్‌ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రశాంత్‌ నుంచి తిరుపతయ్య ఈ పేపర్‌ను
తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాల్స్ డేటా ఆధారంగా..

ప్రధాన నిందితుల ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా జరిపిన దర్యాప్తులో వారు తమ సొంత జిల్లాల్లో పరిచయం ఉన్నవారికి ప్రశ్నపత్రాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినవారు తిరిగి ఎవరెవరికి వాటిని విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ప్రశాంత్‌, రాజేందర్‌కుమార్‌ ఇచ్చే సమాచారంతో మరికొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, ఢాక్యా, రాజేశ్వర్‌లను సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. తొలుత అరెస్ట్‌ చేసిన తొమ్మిది మంది నిందితులను ఆరు రోజులపాటు సిట్‌ కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. వారిలో ఈ నలుగురిని మరోసారి విచారించేందుకు కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో వీరిని సిట్‌ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular