Telangana DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచే దరఖాస్తులు, నియమ నిబంధనలివీ

తాజాగా భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 11,062 ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : March 4, 2024 12:00 pm
Follow us on

Telangana DSC Notification : నిరుద్యోగుల ఏళ్లనాటి ఆకాంక్షను నెరవేరూస్తూ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ సోమవారం(మార్చి 4న) విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతేడాది డీఎస్సీ నోటిఫికేషన్‌కు 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో టెట్‌ అర్హత ఉన్నవారు 4 లక్షల వరకు ఉంటారని అంచనా. ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇలా దరఖాస్తు చేయాలి..
తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ – 2024 విడుదలైంది. 2023 సెప్టెంబర్‌లో 5.089 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వగా దానిని రద్దు చేసి తాజాగా 11,062 పోస్టులతో నోటిఫికేషన విడుదల చేశారు. అర్హతగల అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తొలుత పోస్టును ఎంచుకుని, నిర్దేశిత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పూర్తి చేయాలి. గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.

పోస్టుల వివరాలు..
తాజాగా భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 11,062 ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీలు..
డీఎస్సీ–2024 నోటిఫికేషన్‌లో జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే.. హైదరాబాద్‌ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉన్నాయి. అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లాలో 26 మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 74 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 158 ఉండగా… ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే…స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా…224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్‌ అసిస్టెంట్‌ లు ఖాళీగా ఉంటే… 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

దరఖాస్తు ఇలా..
అప్లికేషన్‌ ప్రాసెసింగ్, రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్టుకు రూ.1000, వేర్వేరు పోస్టులకు హాజరయ్యే వారు ప్రతీ పోస్టుకు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తు చేసే ప్రతీ పోస్ట్‌కు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి. మార్చి4 వ తేదీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://tsdsc.aptonline.in/tsdsc/ ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్‌ ద్వారా క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డ్‌ / నెట్‌–బ్యాంకింగ్‌ ద్వారా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లుగా పేర్కొన్నారు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష..
ఇక డీఎస్సీ – 2024 పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్టు ద్వారా నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ, 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.