OYO room booking: నేటి కాలంలో చాలామంది ప్రైవసీని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మూడవ కంటికి కనపడకుండా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఓయో రూములకు ఓటు వేస్తున్నారు. అక్కడైతే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని.. 4 గోడల మధ్య అంతకుమించిన ఏకాంతం లభిస్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఓయో రూంలలో అపరిమితమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఓయో రూమ్ లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నట్టు కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓయో రూములపై పోలీసులు నిఘా పెట్టారు. తనిఖీలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఓయో రూంలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏకంగా 5000 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. కొంతకాలంగా ఈ స్థాయిలో పోలీసులు తనిఖీలు చేసినట్టు చరిత్రలో లేదు. ఆపరేషన్ లో భాగంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రికార్డులు.. కస్టమర్ల వివరాలను సేకరించారు. ఓయో రూంలలో ఉన్న భద్రతా ప్రమాణాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
అలా వెళ్తే మాత్రం..
ఓయో రూములకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంట ఐడి కార్డులు లేకుండా వెళ్తే మాత్రం బుక్ అయినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ ఓయో రూములలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. పైగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం.. దాంతోపాటు గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నేపథ్యంలో.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో 5000 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు అంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
“వ్యక్తిగత స్వేచ్ఛకు మేము భంగం కలిగించేది లేదు. మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. శాంతి భద్రతలను పరిరక్షించడమే మా ధ్యేయం. అందువల్లే ఓయో గదులలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. భద్రత ప్రమాణాలను.. ఓయో గదులలో ఉన్న సౌకర్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని” పోలీస్ అధికారులు చెబుతున్నారు.
View this post on Instagram
