India vs Bangladesh: భారత క్రికెట్ జట్టు ఇటీవల పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. మొన్న న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్ను గెలిచినా.. వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ నిరాశలోనే బంగ్లాదేశ్ టూర్కు వెళ్లింది. టీం ఇండియా. ఇక్కడ కూడా ఓటమితోనే టూర్ ప్రారంభించింది. గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో మ్యాచ్ను బంగ్లాదేశ్కు సమర్పించుకుంది. తొలి వన్డే ఓటమి టీమిండియాకు పెద్ద షాకే. ఇంకోటి ఓడితే బంగ్లా గడ్డపై వరుసగా రెండో వన్డే సిరీస్ చేజారుతుంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రోహిత్ సేన సిద్ధమైంది.

తప్పక నెగ్గాల్సిన మ్యాచ్..
రెండో వన్డేలో బుధవారం ఆతిథ్య బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. తొలి వన్డేలో గెలిచిన బంగ్లాదేశ్ సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దీంతో ఒత్తిడి భారత్పైనే ఉంది. ఆటను రోహిత్సేన బాగా మెరుగుపర్చుకోవాల్సివుంది. తొలి వన్డేలో బ్యాటింగ్లో తడబడ్డా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించిన టీమ్ఇండియా.. గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. ఒక్క వికెట్ తీయలేక రోహిత్సేన పరాజయం చవిచూసింది. మెహదీ హసన్, ముస్తాఫిజుర్ చివరి వికెట్కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్ లైనప్ రెండో వన్డేలో మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది.
2015లో బంగ్లాలో ద్వైపాక్షిక సిరీస్..
భారత్ చివరిసారిగా 2015లో బంగ్లాదేశ్లో వన్డే ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పుడు ధోని నేతృత్వంలోని జట్టు 1–2తో సిరీస్ను చేజార్చుకుంది. ఆ ఒక్క విజయాన్ని కూడా నామమాత్ర మ్యాచ్లో సాధించింది. స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మరోసారి 11–40 ఓవర్ల మధ్య భారత బ్యాటర్లకు కళ్లెం వేస్తే చరిత్రను పునరావృతం చేయొచ్చని బంగ్లాదేశ్ భావిస్తోంది. తొలి మ్యాచ్లో రాహుల్ మినహా భారత బ్యాటర్లంతా ఆ ఓవర్ల మధ్యే ఇబ్బందిపడ్డారు. ఈ మ్యాచ్లోనైనా రోహిత్, కోహ్లి, ధావన్ చెలరేగాలని భారత్ ఆశిస్తోంది. మొత్తంగా టీమ్ఇండియా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయడం అవసరం. డాట్ బాల్స్ ఆడడం తగ్గించాలి. తొలి వన్డేలో 25 ఓవర్ల కంటే ఎక్కువ విలువైన డాట్ బాల్స్ ఆడారు.

రెట్టించిన ఉత్సాహంలో బంగ్లాదేశ్..
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముస్తాఫిజుర్, ఎబాదత్, హసన్ మహమూద్, షకీబ్, మెహదీ హసన్ తో బంగ్లా బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్లో ఆ జట్టుకు సమస్యలున్నాయి. తొలి వన్డేలో ఓ దశలో 104 బంతులు ఆడిన బంగ్లా టీం ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. కానీ చివరి బ్యాట్స్మెన్స్ ఆడిన ఆట టీమిండియా ఓటమికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో సిరీస్ రేసులలో నిలబడాలంటే రెండో వన్డే భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.