Seven Saturdays Puja: హిందూ సంప్రదాయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. కలియగ దైవంగా భావించి ఈ స్వామిని దర్శించుకోవడానికి పరితపిస్తుంటారు. అయితే ఏడు వరుస శనివారాల పాటు వేంకటేశ్వర స్వామివారికి చేసే ప్రత్యేక పూజతో శని ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ శని ప్రభావం తగ్గాలంటే ఏడు శనివారాల పాటు ఏం చేయాలి? వాటిని ఎలా పాటించాలి?
శనివారం శని గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. అదే సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. శని దోషాలు, అష్టమ శని, ఏలినాటి శని, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు వంటి కష్టాలు తగ్గాలని కోరుతూ అనేక మంది వరుసగా ఏడు శనివారాలు ఈ పూజను నిర్వహిస్తారు. శని ప్రభావం ఉందని భావించే వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, కుటుంబ శాంతి కోరుకునేవారు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోరేవారు ఈ పూజను చేయవచ్చు. మహిళలు, పురుషులు, కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
పూజ ప్రారంభించే విధానం
మొదటి శనివారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో లేదా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, పూలు, తులసీదళాలు సమర్పించి భక్తితో పూజ చేయాలి. స్వామివారికి పాలు, పండ్లు, లడ్డూ లేదా ఇతర సాత్విక నైవేద్యాలను సమర్పిస్తారు.
పూజ అనంతరం శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణ, ఓం నమో వేంకటేశాయ నమః మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం శ్రేయస్కరంగా భావిస్తారు. కొందరు ప్రతి శనివారం ఆలయ దర్శనం కూడా చేస్తారు.
పాటించాల్సిన నియమాలు
ఏడు శనివారాలు సాధ్యమైనంత వరకు సాత్వికాహారం తీసుకోవాలి. మద్యపానం, మాంసాహారం, అసత్యం, కోపం వంటి వాటికి దూరంగా ఉండాలని ఆచారం. పేదలకు అన్నదానం, నువ్వుల నూనె దీపం వెలిగించడం, గోవులకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి దానం చేయడం కూడా ఈ వ్రతంలో భాగంగా చాలామంది పాటిస్తారు.
ఏడవ శనివారం ప్రత్యేక పూజ నిర్వహించి, వీలైతే శ్రీ వేంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించుకోవడం లేదా అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ. కొందరు స్వామివారికి తులసీమాల, వెన్న, లడ్డూ వంటి నైవేద్యాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటారు.
