IT industry: ఎందుకీ తగ్గుదల? ఐటీ పరిశ్రమను కలవ పెడుతున్న పరిణామం!

సాధారణంగా ఐటీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు.. లాభ, నష్టాల గురించి ఎక్కువమంది ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఈసారి ఐటీ కంపెనీల ఫలితాల్లో అందరి దృష్టి ఉద్యోగుల సంఖ్య పైనే పడుతున్నది.

Written By: Bhaskar, Updated On : October 16, 2023 2:40 pm
Follow us on

 IT industry: ఐదు అంకెల జీతం. వారంలో రెండు రోజులు సెలవు దినాలు. వద్దన్నా రుణాలు ఇచ్చే బ్యాంకులు. ప్రతి ఏడాది తప్పకుండా వేతనం పెంచే కంపెనీలు.. పని చేసే చోట సకల సౌకర్యాలు. మెరుగ్గా పనిచేస్తే అద్భుతమైన ఇంక్రిమెంట్లు.. ఇంకా బాగా పనిచేస్తే విదేశాల్లో పనిచేసే వెసలు బాట్లు.. ఐటీ ఉద్యోగం అంటే పైవే చాలామందికి గుర్తుకొస్తాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఐటీ ఉద్యోగం అంటే మేడిపండు సామెత తీరుగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీలు దేవుడెరుగు.. పెద్దపెద్ద సంస్థలే తలలు పట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీలో త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏకంగా ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడం ఐటీ పరిశ్రమ పరిస్థితిని తేట తెల్లం చేస్తోంది.

సాధారణంగా ఐటీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు.. లాభ, నష్టాల గురించి ఎక్కువమంది ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఈసారి ఐటీ కంపెనీల ఫలితాల్లో అందరి దృష్టి ఉద్యోగుల సంఖ్య పైనే పడుతున్నది. ఎందుకంటే దిగ్గజ ఐటీ కంపెనీలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్.. ఈ మూడింటిలోనూ కలిపి రెండవ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 16,162 కు తగ్గింది. ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే గాని తగ్గడం అనేది తక్కువ సందర్భాల్లోనే ఈ కంపెనీలో చోటుచేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా తగ్గడం, ఉద్యోగార్దులను కలవరపెడుతోంది.

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టిసిఎస్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏకంగా 6,333 కు తగ్గింది. ఈ కంపెనీలో ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గిన దాఖలాలు లేవు. ఇన్ఫోసిస్ లో 7,530, హెచ్ సి ఎల్ టెక్ లో 2,299 మంది చొప్పున తగ్గారు. ఇదే తరహాలో ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం పట్ల ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కంపెనీలు ఇప్పటికే నియమించుకున్న ఉద్యోగులను, వారి నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నాయి. అంటే బెంచ్ పై ఉంచే వారి సంఖ్య క్రమేపి తగ్గుతోంది. తమ దగ్గర రాజీనామా చేసి, వేరే కంపెనీలకు వెళ్లిపోయిన సంఖ్యకు తగ్గట్టుగా కంపెనీలు నియమించుకోవడం లేదు. అతను దీంతో ఉద్యోగుల సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. ఉదాహరణకు టిసిఎస్ విషయానికి వస్తే గత ఒకటిన్నర ఏళ్లలో తాజా ఉత్తీర్ణులపై పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.. కంపెనీకి అవసరం ఉన్నప్పుడల్లా బెంచ్ పై ఉన్న ప్రెషర్లకు శిక్షణ ఇస్తూ వాటిని వినియోగించుకుంటున్నది. ఇన్ఫోసిస్ కంపెనీ కూడా దాదాపుగా ఇలానే చేస్తోంది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్ల సంఖ్య వాళ్ళ సిబ్బంది వలసల రేటు తగ్గుతోందని ఐటి నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు ఐటీ సాఫ్ట్వేర్/ సేవల నియామక సూచి గత ఏడాది తొమ్మిది నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో తగ్గుతూనే వచ్చింది. గిరాకీలో మందగమనం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి వల్ల కొద్ది త్రైమాసికాల్లో వలసల రేటు కూడా తగ్గుతోంది. దీని వల్ల ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిందని ఐటీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్రభావం క్యాంపస్ ప్లేస్మెంట్ పై కూడా చూపిస్తోంది. ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారికి కంపెనీలు ఇప్పటివరకు కొలువులు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ పదివేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని ప్రకటించింది. ఇందులో భాగంగా 5200 మందిని నియమించుకుంది. ఇక టిసిఎస్ కూడా 40 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. అంటే ఈ ప్రకారం చూస్తే ప్రెషర్లకు ఇది ఊరట ఇచ్చే అంశం. కానీ మిగతా కంపెనీలు ఆ దిశగా హామీలు ఇవ్వడం లేదు.