Adani: అదానీ అక్రమాలను సెబీ పట్టించుకోలేదా? యూకే సిన్హా ఎన్డిటీవీలోకి ప్రవేశం వెనుక మతలబు అదేనా?

ఓసీసీ ఆర్పీ నివేదికపై అదా నీ గ్రూపు స్పందించింది. హిండెన్ బర్గ్ నివేదికలోని ఆరోపణలనే మళ్లీ చేశారని, ఇదంతా జార్జ్ సొరేస్ ప్రాయోజిత విదేశీ మీడియా చేస్తున్న పని అని అదానీ గ్రూప్ పేర్కొన్నది.

Written By: K.R, Updated On : September 1, 2023 9:46 am

Adani

Follow us on

Adani: హిండెన్ బర్గ్ నివేదిక తో అతలాకుతలమైన అదానీ గ్రూప్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.. అక్రమ లావాదేవీలకు పాల్పడిందని ఓ సి సి ఆర్ పి అనే సంస్థ కీలక ఆధారాలు బయటపెట్టింది. దీంతో గౌతమ్ అదాని కంపెనీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అయితే ఈ అక్రమాల గురించి 2014లోనే దేశంలో కార్పొరేట్ వ్యవహారాలను పరిశీలించే సెబీ కి కొన్ని ఆధారాలు లభించాయని తెలుస్తోంది. అయితే అప్పుడు సెబీ అధిపతిగా యూకే సిన్హా ఉండేవారు. ఆయన ప్రస్తుతం అదాని సొంతం చేసుకున్న ఎన్డి టీవీ డైరెక్టర్. చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారని ఓ సి సి ఆర్ పి చెబుతోంది. ఈ సంస్థ నివేదిక వెలువరించడంతో అదాని గ్రూపుకు సంబంధించిన షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

ఏమిటి ఈ సంస్థ?

ఓ సి సి ఆర్ పి అనేది ఒక పరిశోధనాత్మక జర్నలిస్టులతో కూడిన అంతర్జాతీయ నెట్వర్క్. ఆరు ఖండాల్లోని పలు దేశాల్లో తమ సిబ్బంది పని చేస్తున్నారని ఆ సంస్థ చెబుతోంది. 2006లో ఏర్పాటైన ఓ సి సి ఆర్ పి వ్యవస్థీకృత నేరాలు, అవినీతిని వెలికి తీయడంపై ప్రధానంగా కృషి చేస్తోంది. 2017లో ఎన్జీవో అడ్వైజర్ అనే సంస్థ ప్రపంచంలోని 500 ఉత్తమ ఎన్జీవోల జాబితాను వెలువరించింది. అందులో ఓసీసీ ఆర్పీకి 69వ స్థానం లభించింది. ఈ నెట్వర్క్ ను సీనియర్ జర్నలిస్టులు డు సులి వాన్, పాల్ రాదు నెలకొల్పారు. అయితే ఈ సంస్థ పనితీరుపై, వెలువరించిన నివేదికపై అదానీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

జార్జ్ సొరేస్ ఉన్నారా?

ఓసీసీ ఆర్పీ నివేదికపై అదా నీ గ్రూపు స్పందించింది. హిండెన్ బర్గ్ నివేదికలోని ఆరోపణలనే మళ్లీ చేశారని, ఇదంతా జార్జ్ సొరేస్ ప్రాయోజిత విదేశీ మీడియా చేస్తున్న పని అని అదానీ గ్రూప్ పేర్కొన్నది. ఈ ఆరోపణలపై పది సంవత్సరాల క్రితమే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తు జరిపి, సదరు కేసులను కూడా మూసివేసిందని ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వివరించింది. కాగా, హంగరీ, అమెరికా దేశాలకు చెందిన వ్యాపారవేత్త, దాత జార్జ్ సొరేస్ 93 సంవత్సరాల వృద్ధుడు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ అనే సంస్థ పేరుతో వివిధ దేశాల్లోనే నియంతృ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారు. విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రధానిపై ఆరోపణలు చేసిన ఓ సి సి ఆర్ పి కి కూడా ఓపెన్ సొసైటీ విరాళాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్.. అదా నీ గ్రూపులో అక్రమ లావాదేవీలు జరిగాయని వెల్లడించడం, ఫలితంగా గ్రూపు సంపద 15 వేల కోట్ల డాలర్ల మేర పతనమైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా
జార్జ్ సొరేస్ పేరు ప్రముఖంగా వినిపించింది. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో సెబీ దర్యాప్తు జరిపి ఇటీవల తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఓ సి సి ఆర్ పి ఆరోపణలపై “360 వన్ అసెట్ మేనేజ్మెంట్ ( మారిషస్) లిమిటెడ్” అనే సంస్థ స్పందిస్తూ, ఈ ఎం రీసర్జెంట్ ఫండ్ లకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా ఉన్నామని, వీటిలో అదాని గ్రూప్ కంపెనీలు గాని, ఓ సి సి ఆర్ పి నివేదికలో పేర్కొన్న వ్యక్తులు గాని ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని వివరించింది. అయితే, ఈ ఫండ్ లు ఇతరేతర అనేక పెట్టుబడులతో పాటు అదానీ గ్రూపు కంపెనీల షేర్లను కూడా గతంలో కొనుగోలు చేశాయని, 2018 లోనే విక్రయించాయని వెల్లడించింది.