YSR Congress Party : ఏదైనా రాజకీయ పార్టీలో రాణించాలి అంటే పనితీరు మెరుగుపరుచుకోవాలి. ప్రజల మన్ననలు పొందాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అందుకు భిన్నం. ఆ పార్టీలో ప్రమోషన్ పొందాలన్నా.. పదవులు దక్కించుకోవాలని అనుకున్నా ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద బూతులతో విరుచుకుపడాలి. ఆయా పార్టీల నేతల ఇళ్లపై కర్రలతో దాడులకు దిగాలి. లేకుంటే నిత్యం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగా ఉంటూ ఆయన నామస్మరణ చేయాలి. ఆయన అడుగులకు మడుగులు వత్తాలి. అప్పుడే వారికి పదవులు లభిస్తాయి. పిలిచి మరి పదవులు కట్టబెడతారు. వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్ల హయాంలో జరిగింది కూడా అదే. అరాచక నేతలకు పదవులు కట్టబెట్టారు.
* బూతులతో విరుచుకుపడడమే ప్రగతి..
ఏదైనా మంత్రి పదవి నిర్వర్తిస్తే వారి శాఖలో ప్రగతి చూస్తారు. కానీ వైసీపీ హయాంలో శాఖల ప్రగతి కంటే ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే మంత్రులే అధికం. కొడాలి నాని కి( Kodali Nani) తొలి మూడేళ్లు పదవి ఇచ్చారు జగన్. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడనిదే పొద్దు గడవదు అన్నట్టు ఉండేది కొడాలి నాని పరిస్థితి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని మెప్పించారు కనుక కొడాలి నానికి మంత్రి పదవి దక్కింది. ఏకంగా పౌరసరఫరాల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అంతెందుకు జోగి రమేష్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చంద్రబాబు ఇంటి మీదకు కర్రలతో దాడికి తెగబడినందుకే జోగి రమేష్ కు ఏకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా క్యాబినెట్ లో చోటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి.
* అందరూ అలానే…
సొంత సామాజిక వర్గాన్ని జగన్ కోసం కించపరిచారు పేర్ని నాని( perni Nani ). ఇక అంబటి రాంబాబు గురించి చెప్పనవసరం లేదు. అప్పటికీ ఇప్పటికీ ఆయన నోరు అదుపులోకి రావడం లేదు. పోసాని కృష్ణ మురళి అయితే పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబాన్ని నీచాతి నీచంగా దూషించారు. ఏకంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఇక రోజా గురించి చెప్పనవసరం లేదు. రోజా గురించి చెప్పనవసరం లేదు. బూతు సైగలతో,, చిల్లర మాటలతో ప్రత్యర్థులను రెచ్చగొట్టేవారు. రెచ్చిపోయేవారు. అందుకు ఆమె పర్యాటక శాఖ మంత్రి పదవి పొందారు. ఇలా జగన్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ హద్దులు చెరిపేసి దిగజారి ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కాయి. ఇప్పుడు అంబటి రాంబాబుకు ఏ స్థాయిలో ప్రమోషన్ దక్కుతుందో చూడాలి.
