YSRCP Kapu leaders : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిలో ఒక రకమైన భయం ఉంది. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే వారంతా కొనసాగుతున్నారు. కూటమి పార్టీలో చేరాలనుకున్నా.. ఆ మూడు పార్టీల నాయకత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో వైసీపీలోనే ఉంటూ కాస్త హడావిడి చేస్తున్నారే తప్ప.. మనస్ఫూర్తిగా పనిచేయని కాపు నేతలు వైసీపీలో అధికంగా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వైసిపిలో కొనసాగుతున్నారు. రెండేళ్లు అవుతున్నా పార్టీలో ఎటువంటి పురోగతి లేదు. పుంజుకున్న దాఖలాలు లేవు. ఆపై కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే తమ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోతుందని భయం ఆ నేతల్లో ఉంది.
* ఆ మెజారిటీలు చూశాక..
మొన్నటి ఎన్నికల్లో కూటమికి రికార్డు స్థాయిలో మెజారిటీ లభించింది. ఆ ఫలితాలు చూశాక చాలామంది వైసిపి నేతలకు భవిష్యత్తుపై ఆశలు పోయాయి. అందుకే కూటమి పార్టీల్లోకి జంప్ కావాలని భావించారు. కానీ స్థానిక రాజకీయాల దృష్ట్యా కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఈ నేతలంతా అటు వెళ్లలేక.. ఇటు ఉండలేక వైసీపీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వైసీపీలో ఉంటూ ఉనికి కోసం వారు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇప్పుడు కాపు ఆత్మీయ సదస్సులు అంటూ సరికొత్త రాగాలు అందుకుంటున్నారు. నిన్ననే కాపు నేతల ఆత్మీయ సదస్సు జరిగింది. కాపులకు రాజ్యాధికారం కావాలన్నట్టు వారు మాట్లాడారు. వైసీపీకి దీంతో సంబంధం లేదు అని సంకేతాలు ఇచ్చారు. అయితే వీరు పార్టీ కోసం.. జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ప్రయత్నం చేయలేదు. కేవలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించారు.
* కాపు ఆత్మీయ సమావేశాలు..
పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాపుల ఆత్మీయ సమావేశం పెట్టారు. కూటమి నుంచి పవన్ బయటకు వచ్చేలా ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రయత్నం చేశారు. కానీ అంతకుమించి నిజం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఇస్తామంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటే మాత్రం వీరంతా కూటమి గూటికి చేరడం ఖాయం. ముఖ్యంగా జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో డీలిమిటేషన్ జరగనున్న దృష్ట్యా దాదాపు 80 సీట్లు పెరుగుతాయి. వాటిలో వారి వారసులకు అవకాశం కల్పిస్తామన్న మరుక్షణం వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం. ఈ కాపు ఆత్మీయ సమావేశాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా జరగవచ్చు. కానీ వాటిని తమ వారసులకు ఒక రాజకీయ వారధిగా మార్చుకోవాలని చూస్తున్నారు నేతలు.
* అందరిదీ అదే తీరు..
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కాపు నాయకులు పునరాలోచనలో ఉన్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేత జగన్ ఆదేశాల ప్రకారం ఆత్మీయ సదస్సులు పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇందులో మెజారిటీ కాపు నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో డిలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన మరుక్షణం ఏపీలో రాజకీయాలు మారిపోతాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కాపు నేతలంతా వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీలో ఉంటారు అనుకోవడం చాలా తప్పు. వారు కూటమి నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అని జగన్ అనుకున్నారు. కానీ జస్ట్ టైం పాస్ అని కాపు నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే జూలైలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం చాలామంది కాపు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయం. అటువంటి వారంతా టిడిపి కంటే జనసేన వైపు వెళ్తారు. అలా ప్లాన్ చేస్తున్నారన్నమాట.
