Unemployment in India : “ఓ చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో ఖాళీ పొట్ట పట్టుకుని తిరుగుతున్నాం సార్. ఉద్యోగం ఎవడూ ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్లినా రిఫరెన్సులు అడుగుతున్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది.. ఈ దేశం ఇలా నాశనం అవుతోంది అంటే దానికి ప్రధాన కారణం మీరే సార్. మీరు ఉద్యోగాలు ఇవ్వరు. మమ్మల్ని బతకనివ్వరు” అప్పట్లో విపరీతంగా ప్రాచుర్యం పొందిన ఓ చిత్రంలో కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఇది.
ఆ సినిమా ఇప్పటికాలానికి నిజంగా సరిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఇప్పటి పరిస్థితి ఊహించి ఆ సినిమా తీసినట్టు కనిపిస్తోంది. ఆ సినిమాలో మాదిరిగానే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు హాహా కారాలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. ఆ పోటీ ఎంతలా ఉందంటే ఒక్క ఉద్యోగానికి దాదాపు 88 మంది దరఖాస్తు చేసుకునేలా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 32,679 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు దాదాపు 28.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రకారం ఒక్కొక్క పోస్టుకు 88 మంది పోటీ పడుతున్నారు.
సోమవారం నుంచి మూడు రోజులపాటు రాధా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తండోపతండాలుగా వెళ్లిపోతున్నారు. అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రవాణా ఏర్పాటు చేయలేకపోవడంతో.. రైల్వే స్టేషన్ లు.. బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో తర్వాత పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు మొత్తం కిక్కిరిసి వెళ్ళిపోవాల్సి వస్తోంది. బస్సులు.. రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. అక్కడ జనాభా కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే నిరుద్యోగ యువతకు తగ్గట్టుగా అక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి 88 మంది పోటీ పడుతున్నారంటే అక్కడ నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో కొన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పుడు కూడా ఇంతే సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు కూడా రైల్వే స్టేషన్ లు.. బస్ స్టేషన్ లు నిరుద్యోగులతో కిటకిటలాడాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.
