TCS Nashik case : దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి.. ఐపీఎల్ సీజన్ జరుగుతోంది.. గల్ఫ్ శాంతి చర్చలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో 2020 నుంచి సాగుతున్న లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి యత్నాలు బయటపడ్డాయి. ఇవి ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేసే యువతుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతున్నాయి. ఉద్యోగ అవకాశం చూపి యువతులను లొంగదీసుకోవడం, మతపరమైన వేధింపులకు గురిచేయడం, సామూహిక అత్యాచారాలు జరగడం వంటి ఘోరాలు వెలుగుచూశాయి.
40 రోజుల ఆపరేషన్తో..
ముంబై పోలీసులు 40 రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి ఈ ఘోరాన్ని బయటపెట్టారు. ఏడెనిమిది మంది మహిళా పోలీసులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా టీసీఎస్లో చేర్పించి, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగిని ట్రాప్ చేశారు. వాట్సాప్ గ్రూపులు, మతపరమైన సందేశాలు, బాధితుల వాంగ్మూలాలు ఆధారంగా ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా హెచ్ఆర్ అధికారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, దానిష్, షారుఖ్ ఖురేజీ, రెజా రహ్మాన్, తౌసీఫ్ అత్తర్ ఉన్నారు. వీరు కలిసి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నడుపుతూ, హిందూ యువతులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, పెళ్లి చేసుకుంటామని మాటిచ్చి, లైంగికంగా వేధించారు. హిందూ దేవుళ్లపై అసభ్యకరంగా మాట్లాడడం, రంజాన్లో రోజా పాటించమని బలవంతం చేయడం, బీఫ్ తినిపించడం వంటి ఘోరాలు జరిగాయి.
బాధితురాలి పోరాటం.. పోలీసుల ధైర్యం
ఒక హిందూ యువతి ఇంజినీరింగ్ పూర్తి చేసి టీసీఎస్లో చేరింది. సీనియర్ ఉద్యోగి ఆమెపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. తర్వాత ఆమెకు మెహరీన్ అనే మహిళ ఫోన్ చేసి, ఆ ఉద్యోగి వివాహితుడని, తాను అతని భార్యనని తెలిపింది. దీంతో బాధితురాలు అతడిని నిలదీయగా, వేధింపులు మొదలయ్యాయి. కంపెనీలోని ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్లో ఫిర్యాదు చేసినా, ముస్లిం అధికారి ‘ఇవన్నీ కామన్‘ అని తోసిపుచ్చారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు ఆపరేషన్ చేయకపోయి ఉంటే, ఆ యువతి ఆక్రందన అరణ్యరోదనగా మిగిలేది. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న టీసీఎస్..
నిందితుల అరెస్టు తర్వాత మూడు రోజులకు టీసీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అరెస్టయిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కానీ వారి నేరాల గురించి, బాధితులకు జరిగిన అన్యాయం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామనే హామీ కూడా ఇవ్వలేదు.
కార్పొరేట్ ప్రపంచంలో భద్రతా లోపాలు..
ఈ ఘటన కార్పొరేట్ ప్రపంచంలోని లోటుపాట్లను బయటపెట్టింది. బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనం. హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన వేధింపులు మతపరమైన వివక్షకు నిదర్శనం. మతపరమైన ప్రమేయం ఉన్న ఉద్యోగులు కీలక పదవుల్లో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తల్లిదండ్రుల్లో ఆందోళన…
ఏటా లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి, లక్షల వేతనం ఆశతో ఐటీ కంపెనీల్లో చేరుతున్నారు. కానీ టీసీఎస్ ఘటన తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఉద్యోగం పేరుతో పిల్లలు నరకం చూస్తుంటే, వారిని ఎలా కాపాడాలనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇలాంటి నేరాల్లో పాల్పడినవారిపై కఠిన చట్టాలు అమలు చేయాలి. కంపెనీల ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్లకు బయట స్వతంత్ర పర్యవేక్షణ అవసరం. ఉద్యోగ ప్రాంతాల్లో మతపరమైన ప్రస్తావనలు, ప్రచారాలు పూర్తిగా నిషేధించాలి. కంపెనీలు ఉద్యోగుల భద్రతకు బాధ్యత తీసుకోవాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఉద్యోగం కోసం నగరాలకు వలస వచ్చిన యువతకు కార్పొరేట్ కంపెనీలు సురక్షిత ప్రాంతాలుగా ఉండాలి.
