TANA – SATVIINSPIRE Foundation అనకాపల్లి: విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులు వారి విద్యా పురోగతిని సులభంగా పర్యవేక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), SATVIINSPIRE ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి చి. శ్రీచరణి మేకా స్పాన్సర్గా వ్యవహరించగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ చౌదరి మేకా సమన్వయంతో డైరీలను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హోంవర్క్ డైరీల ద్వారా విద్యార్థులు ప్రతిరోజూ చేసే హోంవర్క్, పాఠశాల కార్యకలాపాలు, విద్యా పురోగతిని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో బాధ్యతాభావం, సమయపాలన, క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు పాఠశాల–తల్లిదండ్రుల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ఈ విద్యా సేవా కార్యక్రమానికి సహకరించిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా ఫౌండేషన్ సభ్యులు, SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, శ్రీనివాసరావు, మహేశ్వరరావు, కొండమ్మ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, అలాగే తానా న్యూజెర్సీ బృందం మార్గదర్శకత్వం, సహకారం అందించారు.

ఈ సందర్భంగా SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, అర్హత కలిగిన ఉపాధ్యాయులు సేవలందిస్తున్న, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధికంగా చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తానా, SATVIINSPIRE ఫౌండేషన్ చేపడుతున్న విద్యా సేవా కార్యక్రమాలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.
