రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిబంధనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆ సందర్భంగా కరోనా కట్టడికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన కోర్టుకు విన్నవించారు.