Revanth Reddy : కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అత్యంత కీలకమైన మేడిగడ్డ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే కృంగిపోయింది.. నాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే దానిమీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత దీని గురించి రకరకాల వార్తలను వండి వారించారు. అవేవీ నిలబడలేదు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.
మేడిగడ్డ నాడు కృంగిపోయింది . ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం అనేక సార్లు దాని పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేసింది. ఇప్పటికి మరమ్మతులు పూర్తికాలేదు. ఎప్పటికీ పూర్తవుతాయో కూడా తెలియదు. మేడిగడ్డ సక్కగా లేకపోవడంతో.. నీళ్లు నిలిపే అవకాశం లేదు. పంప్ చేసే అవకాశం అంతకంటే లేదు. దీనికి తోడు ప్రాణహితలో ప్రస్తుతం ప్రవాహం అధికంగా ఉంది.
ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి రాజకీయాలు మొదలుపెట్టింది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లికి నీటిని పంప్ చేయాలని సరికొత్త డిమాండ్ ఎత్తుకుంది. రిటైర్డ్ ఇంజనీర్లతో సహా ఒక ప్రకటన కూడా చేయించింది. అంతేకాదు ఈ నీటిని గురుదక్షిణగా రేవంత్ రెడ్డి కిందికి వదిలేస్తున్నారని.. పట్టిసీమ ద్వారా చంద్రబాబు ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టింది. వాస్తవానికి మేడిగడ్డ సక్రమంగా ఉంటే సక్రమంగా నీటిని పంప్ చేసేది. మేడిగడ్డ లో ఇప్పటికే రెండు పిల్లర్లు కుంగిపోయాయి. మిగతా రిజర్వార్ల పరిస్థితి కూడా సక్రమంగా లేదని అప్పట్లోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరమ్మతులు పూర్తయిన తర్వాత నీటిని లిఫ్ట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి చేస్తున్న నీటి రాజకీయాలకు రేవంత్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు నేను ఇవ్వడం కాదు.. ఆంధ్ర ప్రాంతం సంబంధించిన విద్యాసంస్థలైన శ్రీ చైతన్య.. నారాయణకు పాలు పోసి హరీష్ రావు వ్యాపారం చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ఆంధ్ర విద్యాసంస్థలను బెదిరించి.. బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ తన డెయిరీ నుంచి పాలు పోస్తున్నారని ఆరోపించారు.. తాను ఆంధ్ర ప్రాంతానికి నీరు ఇవ్వడం లేదని.. ఆంధ్ర ప్రాంత విద్యాసంస్థలకు పాలుపోస్తూ.. హరీష్ రావు వ్యాపారం చేస్తున్నాడని రేవంత్ సరికొత్త పాయింటు లేవనెత్తారు. దీంతో హరీష్ రావు సతీమణి నిర్వహిస్తున్న డెయిరీ వ్యవహారం మరోసారి చర్చకు కారణమైంది. ఇటీవల టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా హరీష్ రావు మీద ఇదే స్థాయిలో ఆరోపణలు చేయడం విశేషం.
