Pawan Kalyan Telangana meeting : గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ కు ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇప్పటికే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు సామేలు.. అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జరగడం అనుమానమేనని అందరికీ అనిపించింది. దానిని నిజం సోమవారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ కు అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. శాంతిభద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభను వ్యతిరేకిస్తూ మంత్రులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు.
టిఆర్ఎస్ అధినేత్రి కవిత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని కట్టుకోలేదు గాని.. తెలంగాణలో నవ నిర్మాణం చేసేందుకు వస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. తెలంగాణ దమ్ము అంటే ఏమిటో గతంలో చూపించామని.. ఈసారి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి అనుకుంటే మూతి పళ్ళు రాలుతాయని కవిత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ మీద ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయాల జరుగుతున్నాయి. అమిత్ షాను కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారని.. దానికి కేంద్ర హోం శాఖ మంత్రి ఒప్పుకోలేదని ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై రక రకాలుగా విమర్శలు వచ్చాయి. చివరికి నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఈ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని మర్చిపోకముందే పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సంచలనం కలిగిస్తోంది. ఒకవేళ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే అప్పుడు సభకు ప్రభుత్వం సహకరిస్తుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది.
