TDP Working President Nara Lokesh : రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎవరు చెప్పినా సరే వినడాన్ని అలవాటు చేసుకోవాలి. అదే ఆ నాయకుడిని గొప్పగా చేస్తుంది. ఈ సువిశాల భారత దేశంలో ఎంతోమంది నాయకులు వచ్చారు. ప్రజల మనసులు గెలిచిన వారు మాత్రమే గొప్ప నాయకులు ఎదిగారు. గొప్ప నాయకులను మాత్రమే తరాలు మారినా సరే ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. గొప్ప నాయకులుగా ఎదగాలి అనుకునేవారు.. కచ్చితంగా గొప్ప పనులు చేయాలి. ఇప్పుడు ఈ జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నారా లోకేష్ చోటు సంపాదించుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ను టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నారా లోకేష్ పేరును ప్రకటించడం ఒకరకంగా టిడిపి భవిష్యత్తు ముఖ చిత్రాన్ని వెల్లడించినట్టయింది.
నారా లోకేష్ కు టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం ఒక రకంగా ఆ పార్టీలో కార్యకర్తలకు ఆనందం కలిగించే విషయం. నారా లోకేష్ పొలిటికల్ ప్రవేశం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగానే సాగింది. మొదట్లో నారా లోకేష్ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన భాషను.. మాట్లాడే విధానాన్ని అందరూ విమర్శించారు. తన తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ కు మంత్రి పదవి లభించిందని.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడు గెలవకుండానే ఆయన మంత్రి అయ్యారని వైసీపీ విమర్శించింది. చివరికి తెలుగులో కూడా సక్రమంగా మాట్లాడలేడని.. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమిపాలయ్యారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఏకంగా పార్టీ కార్యాలయం పై దాడులు కూడా చేశారు. చివరికి చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. పార్టీని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. తన తండ్రిని విడిపించుకున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేశారు.
పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.. నాయకులలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేశారు. పార్టీని యువతకు దగ్గర చేశారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరించారు. అన్నిటికంటే ముఖ్యంగా మంగళగిరిలో ఓటమి తప్ప గెలుపు లేని పార్టీకి విజయాన్ని అందించారు. అంతేకాదు, మంత్రిగా తన బాధ్యతలను నూటికి నూరు శాతం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తున్నారు. కేంద్ర పరిధిలోకి రాష్ట్ర సమస్యలను తీసుకెళ్తూ.. బడ్జెట్ కేటాయింపులలో సింహభాగం లభించే విధంగా చూస్తున్నారు. ఇన్ని రకాలుగా సానుకూలతలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నారా లోకేష్ కు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.
