IPL 2027 Schedule : మనదేశంలో ఐపీఎల్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ జరిగే రోజులలో అభిమానులు మైదానాలకు మాత్రమే పరిమితం అవుతారు. మైదానాల దాకా వెళ్ళలేని వారు టీవీలకు లేదా ఫోన్లకు అతుక్కుపోతారు.. సాయంత్రమైతే చాలు అద్భుతమైన క్రికెట్ మజాను ఆనందిస్తూ ఉంటారు. 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ అశేషమైన భారతీయ క్రికెట్ అభిమానులకు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తూనే ఉంది. అంతటి కరోనా సమయంలో కూడా ఐపీఎల్ ను విడతల వారీగా నిర్వహించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే ఏకంగా విదేశాలలో ఐపీఎల్ నిర్వహించారు.
వందల మంది ఆటగాళ్లు.. లక్షల కోట్ల ఆదాయం.. అంతకుమించినా ఆనందం.. అందిస్తుంటే ఐపీఎల్ నిర్వహించకుండా బీసీసీఐ ఎలా ఉంటుంది.. ప్రతి ఏడాది మెగా వేలం జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి భారీ స్థాయిలో వేలం నిర్వహిస్తారు. ఆటగాళ్ల మీద కోట్లు కుమ్మరిస్తారు.. ఆ తర్వాత టోర్నీ నిర్వహణను అంతకుమించి అనే స్థాయిలో నిర్వహిస్తారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి నిర్వాహక బీసీసీఐ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇక వచ్చే సీజన్ గురించి ఇప్పుడే బిసిసిఐ అప్డేట్ ఇచ్చేసింది.
విపరీతమైన ఎండలు
ప్రస్తుతం దేశంలో విపరీతంగా ఎండలు ఉన్నాయి. వర్షాలు సరిగా కురవడం లేదు. పైగా కరువు పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకారం వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బిసిసిఐ కీలక ప్రకటన చేసింది. విపరీతమైన ఎండలు ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐపిఎల్ సీజన్ ను కొంచెం ముందుకు జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి పది నుంచి మే 15 మధ్యన టోర్నీ నిర్వహించాలని బోర్డు సెక్రటరీ దేవదత్ సైకియా వెల్లడించారు.. ఐపీఎల్, బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ తో చర్చలు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు..
పెంచే అవకాశం లేదట
అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల మ్యాచుల సంఖ్యను 94 కు పెంచే అవకాశం లేదని.. ఎప్పటి మాదిరిగా 74 మ్యాచులు మాత్రమే ఉంటాయని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి మే 31 వరకు ఐపీఎల్ నిర్వహించారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉంది. దక్షిణాఫ్రికా, నమిబియా, జింబాబ్వే వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అందువల్ల ఆ షెడ్యూల్ అనుసరించి.. ఐపీఎల్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ఎండలు విపరీతంగా ఉండడంతో.. మైదానంలో ఆడిన ప్లేయర్లు క్రాంప్స్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వచ్చే ఏడాది కూడా ఎండలు అధికంగా ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. షెడ్యూల్ ఏకంగా 18 రోజులు ముందుకు జరుపుతున్నట్టు సమాచారం.
