Bandi Sanjay son case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ చుట్టూ వివాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. బండి సంజయ్ కుమారుడు ఒక బాలిక మీద లైంగికంగా దాడి చేశాడని ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదు అయింది. ఫోక్సో చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో రాజకీయంగా కలకలం చెలరేగుతుంది.
దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి కుమారుడు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు మొత్తం నిజం కావని.. అవన్నీ బెదిరించడానికి చేస్తున్నవని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది కోట్ల కోసం తనను ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని ఆయన కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఐదు కోట్ల కోసం తనను ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతోందని అతడు ఆ ఫిర్యాదులో స్పష్టం చేశాడు. ఆ అమ్మాయి తనకు స్నేహితుల ద్వారా పరిచయమైందని.. పార్టీలతోపాటు ఆలయాలకు కూడా ఆమెతో కలిసి వెళ్లినట్టు బండి సంజయ్ కుమారుడు స్పష్టం చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి కుమారుడు చెబుతున్నారు. ఇప్పటికే ఆమెకు 50,000 ఇచ్చానని.. తనను డబ్బుల కోసం ఇంకా ఇబ్బంది పెడుతున్నారని.. తనను కాపాడాలని కేంద్ర మంత్రి కుమారుడు ఇప్పటికే చెప్పారు.
కేంద్ర మంత్రి కుమారుడి మీద ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతడు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిపై దాడి చేశాడని.. కేంద్ర మంత్రి కుమారుడు వల్ల అతడు తీవ్రంగా గాయపడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. నాడు గులాబీ పెద్దలు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. అంతే కాదు కేంద్ర మంత్రి కుమారుడి మీద నాడు అధికార పార్టీకి కరపత్రం గా ఉన్న పత్రికలో ఇష్టానుసారంగా కథనాలు ప్రసారమయ్యాయి. తర్వాత ఈ కేసు సంగతి ఏమైందో తెలియదు.
ఇప్పుడు కేంద్రమంత్రి కుమారుడ మీద మరో ఆరోపణలు రావడం.. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాజకీయంగా బండి సంజయ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో బండి సంజయ్ కుమారుడు తప్పు చేశాడా? లేదా? అనే విషయాలను పక్కన పెడితే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ కచ్చితంగా ఈ కేసును తీవ్రంగా తీసుకోవాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన ప్రజల్లో నిర్దోషులు కాలేరు. సోషల్ మీడియా జస్టిస్ పాత్ర పోషించలేదు. అలాంటప్పుడు బండి సంజయ్ కచ్చితంగా తన కుమారుడి విషయంలో నిజాయితీని నిరూపించుకోవాలి.
ఇప్పటికే గులాబీ పార్టీ కౌంటర్ మొదలుపెట్టింది. తన పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్ మీద పదేపదే బండి సంజయ్ ఆరోపణలు చేసేవారని.. ఇప్పుడు ఆ బాధ అర్థం అవుతుందా అంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ కుమారుడి మీద కచ్చితంగా విచారణ జరగాలని.. అప్పుడే నిజాలు బయటికి వస్తాయని గులాబీ నేతలు అంటున్నారు.