Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: విశాఖ తూర్పు లో వైసిపి గెలుపు అంత ఈజీ కాదు..

YSRCP: విశాఖ తూర్పు లో వైసిపి గెలుపు అంత ఈజీ కాదు..

YSRCP: విశాఖ నగరంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు గాజువాక నియోజకవర్గాన్ని సైతం కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపి ఎంవీఎస్ సత్యనారాయణ ను బరిలో దించాలని డిసైడ్ అయ్యింది. ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించింది. విశాఖ ఎంపీగా ఉన్న సత్యనారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై అప్పటివరకు పార్టీ బాధ్యతలు మోసిన నాయకులు షాక్ కు గురయ్యారు. సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. అయినా సరే తనదే విజయం అని ఎంవిఎస్ సత్యనారాయణ భావిస్తున్నారు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులు ఓటమి చవిచూశారు.అందుకే ఈసారి ఎలాగైనా వెలగపూడిని దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నారు.అర్థ బలం, అంగ బలం అధికంగా ఉన్న ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ బరిలో దించితే వెలగపూడి రామకృష్ణ బాబు మట్టి కరవడం ఖాయమని భావిస్తున్నారు. అన్నింటికి మించి ఎంవీఎస్ వెలగపూడి రామకృష్ణ బాబు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో..పో టి ఆసక్తికరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అది అనుకున్నంత ఈజీ అయ్యే పరిస్థితిలో లేదు. స్థానిక వైసీపీ నేతలు సహాయ నిరాకరణ చేస్తుండటమే అందుకు కారణం.

2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేశారు. నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో.. అదే వర్గానికి చెందిన వంశీ కి టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆయనకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లో మహిళా నేత అక్కరామని విజయనిర్మలకు టికెట్ ఇచ్చారు. ఆమె సైతం నెగ్గుకు రాలేకపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి, విజయనిర్మలకు నామినేటెడ్ పదవి కేటాయించారు. 2024 ఎన్నికల్లో వీరిద్దరినీ కాదని.. సిట్టింగ్ ఎంపీ ఎంవీఎస్ తో జగన్ ప్రయోగం చేస్తున్నారు. అయితే నేతల సహాయ నిరాకరణ ఉండడంతో ఇక్కడ గెలుపు అంత ఆషామాషీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయదశమి నుంచి.. విశాఖలో సీఎం జగన్ పాలన ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా సీఎం క్యాంప్ ఆఫీస్ ముఖద్వారంగా భావించే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని జగన్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే ఇది అంత సులువు కాదని తెలుస్తోంది. ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమావేశం నిర్వహించారు. దీనికి వంశీకృష్ణ, విజయనిర్మల గైర్హాజరయ్యారు. ఎంవీఎస్ సత్యనారాయణకు సహకరించేది లేదని సంకేతాలు పంపారు. దీంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే జగన్ కలుగజేసుకొని మిగతా నాయకులను సముదాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ రెండుసార్లు ప్రయోగం చేశారని.. మూడో ప్రయోగానికి సిద్ధపడ్డారని.. ఇది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version