వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు-టీవీ5 ఛానల్ చౌర్మన్ బీఆర్ నాయుడు మధ్య హవాలా లావాదేవీలు జరిగాయంటూ వైసీపీ ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. తమ 15 మంది ఎంపీల బృందం ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. రఘురామ – బీఆర్ నాయుడు మధ్య మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైసీపీ ఎంపీలు ఆరోపించడం గమనార్హం.
మొత్తం 14 పేజీల లేఖను ఎంపీలు సమర్పించారు. ఇందులో.. రఘురామకృష్ణంరాజు.. బీఆర్ నాయుడు మధ్య రూ.11 కోట్ల (లక్ష యూరోలు) హవాలా లావాదేవీలుజరిగినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎంపీలు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ ఆధారాలకు సంబంధించిన వివరాలను ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ ఫిర్యాదుతోపాటు తమ వద్ద ఉన్న కీలక ఆధారాలను కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. రఘురామకృష్ణం రాజు, బీఆర్ నాయుడుపై అక్రమ నగదు చెలామణి చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేయాలని వైసీపీ ఎంపీలు ప్రధాని, ఆర్థిక మంత్రిని కోరారు. అంతేకాకుండా.. వారిద్దరూ దేశం విడిచి పారిపోకుంటా.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హవాలా లావాదేవీలు జరిగాయన్న అంశం మీడియాను కుదిపేస్తోంది. రఘురామకు రెండు ఛానళ్లు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించి మరీ అవాస్తవాలను ప్రచారం చేయించాయనే ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. వైసీపీ ఎంపీలు హవాలా కుంభకోణం అంటూ ప్రధానికి ఫిర్యాదులు చేయడం, ఆధారాలు సమర్పించడం సంచలనంగా మారింది.