Forest Guard Jobs: మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేస్తే పీజీలు, పీహెచ్ డీ లు చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్ట్ కు వందల మంది పోటీపడ్డారు. అనేక రకాల ప్రక్రియల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది.
రాత పరీక్షలో అర్హత సాధించిన వారు తదుపరి పరీక్షలు ఎదుర్కొన్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగుల కోసమే ఆ స్థాయిలో పోటీ ఉంటే.. ఇక అత్యున్నత స్థాయిలో ఉన్న పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే చాలామందికి విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుంది. భత్యాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి కరువు భత్యం జీతంలో నమోదవుతూ ఉంటుంది. పిఆర్సి అమలు చేస్తే భారీగా వేతనం పెరుగుతుంది. అందువల్లే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి తాపత్రయపడుతుంటారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటున్న నేటి కాలంలో మధ్యప్రదేశ్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అక్కడి అటవీశాఖ ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బైగా, భరియా, సహారియా తెగలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పోస్టులకు 26 మంది అర్హత సాధించారు. అయితే శారీరక సామర్థ్య పరీక్షకు కేవలం ఒకే ఒక అమ్మాయి హాజరు కావడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ అమ్మాయి ఒక్కతే పదిహేను కిలోమీటర్లు పాటు నడిచి ఉద్యోగాన్ని సాధించింది. మిగతా అభ్యర్థులు రాకపోవడంతో ఏడు పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. పోటీ ఎక్కువ.. పోస్టులు తక్కువగా ఉండడంతో అభ్యర్థులు భయపడి ఇంటర్వ్యూలకు.. పరీక్షలకు రాలేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మిగతా ఏడు పోస్టులకు తదుపరి నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపడతామని అధికారులు అంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ముందుకు వచ్చింది. దర్జాగా పరీక్షలు ఎదుర్కొని ఉద్యోగం సాధించింది.
